(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
చారిత్రక ప్రసిద్ధి గాంచిన విజయనగరం కోట సోమవారం నిరసనలతో హోరెత్తింది. పది నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని కోట లోపల పీవీజీ విగ్రహం వద్ద మాన్సాస్ సిబ్బంది నిరసనకు దిగారు. తమ అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోట బయట సింహద్వారం వద్ద మాన్సాస్ విద్యాసంస్థల విద్యార్థులు ధర్నా నిర్వహించారు.
కోట లోపలే ఛైర్పర్సన్
మాన్సాస్ ఛైర్పర్సన్ సంచైత కోట లోపలే ఉండిపోయారు. మాన్సాస్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ ఆమె బయటకు రాలేదు.
ఘెరావ్కు విద్యార్థులు సిద్ధం
మాన్సాస్ ఛైర్పర్సన్ విజయనగరం కార్యాలయానికి వచ్చారని తెలుసుకున్న సిబ్బంది, విద్యార్థులు ఆకస్మికంగా ఆందోళనకు దిగారు. ఆమెను ఘెరావ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మాన్సాస్ సిబ్బంది మాట్లాడుతూ .. పది నెలలుగా జీతాలు లేకుండా పస్తులు ఉంటున్నామని.. మాన్సాస్కు కోట్లాది రూపాయలు ఉన్నా జీతాలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మాన్సాస్ ఛైర్పర్సన్గా సంచైత వచ్చిన తరువాత అనేక ఇక్కట్లకు గురవుతున్నామని, సౌకర్యాలు కొరవడుతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.