సంక్షేమ పథకాల అమల్లో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతోంది. నవరత్నాల్లో అత్యధిక పథకాలు ఆన్ లైన్ నగదు బదిలీ కావడంతో పెద్దగా సమస్యలు లేవు. కానీ వ్యద్ధాప్య, వితంతు పింఛన్ల నగదును లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నారు. ఇక్కడే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. సామాజిక పింఛన్ల నగదు లబ్దిదారులకు ఇవ్వాలంటే ముందుగా బయోమెట్రిక్ తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నెట్ స్పీడ్ తక్కువగా ఉండటంతో పింఛన్లు ఇచ్చే వాలంటీర్లకు చుక్కలు కనబడుతున్నాయి. దీనికితోడు ఒకటో తారీఖునే నూరు శాతం పింఛన్లు పంపిణీ చేయాలనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను అనుగుణంగా సర్వర్లు సపోర్ట్ చేయడం లేదు. దీంతో విజయవాడ సమీపంలో పెదపులిపాక గ్రామంలో వాలంటీర్లు అర్థరాత్రి పింఛన్ల పంపిణీ చేపట్టారు.
అర్ధరాత్రి ఏంది సామీ
విజయవాడ సమీపంలోని పెనమలూరు మండలం పెదపులిపాకలో వాలంటీర్లు అర్థరాత్రి 2 గంటలకు పింఛన్ల పంపిణీ చేపట్టారు. పగటి పూట సర్వర్లు మొరాయించడంతో, బయోమెట్రిక్ తీసుకోవడం సాధ్యం కాలేదని వారు చెబుతున్నారు. అయితే అర్థరాత్రి తలుపులు తట్టి జనాలను లేపడంతో ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నారు. అయినా వాలంటీర్లు మాత్రం పింఛన్ల పంపిణీ మాత్రం ఆపలేదు. ఒకటో తేదీనే నూరు శాతం పింఛన్లు పంచాలని అధికారుల ఒత్తిడి చేయడం వల్లే అర్థరాత్రి పంచాల్సి వస్తోందని వాలంటీర్లు చెబుతున్నారు.
పింఛను ఇవ్వడానికి వెళ్తే కొత్త పితలాటకం?
ఏపీలో వృద్ధులకు, వితంతువులకు ప్రతి నెలా రూ.2250 పింఛను పంపిణీ చేస్తున్నారు. ఏపీ సీఎం జగ్మోహన్ రెడ్డి ఎన్నికల హామీ మేరకు ఏటా రూ.250 పెంచాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర ఏడాది అయినా పింఛను పెంచకపోవడంపై లబ్దిదారులు, వాలంటీర్లను నిలదీస్తున్నారు. పింఛను ఎప్పుడు పెంచుతారంటూ వాలంటీర్లను నిలదీయడంతో వారు మీ ఎమ్మెల్యేని అడగండని చెబుతున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యే కనబడితే కదా అడిగేది అంటూ పింఛను లబ్ధిదారులు నిట్టూరుస్తున్నారు.
జనవరి నుంచి పింఛన్లు పెంచే అవకాశం
వచ్చే ఏడాది జనవరి నుంచి సామాజిక పింఛను మరో రూ.250 పెంచి, మొత్తం రూ.2500 ఇస్తారని తెలుస్తోంది. సామాజిక పింఛన్లు పెంచకపోవడంతో ఇప్పటికే వైసీపీ నేతలను గ్రామీణులు నిలదీస్తున్నారు. సంవత్సరానికే పెంచుతామన్నారు, ఒకటిన్నర ఏడాది అయింది, నేటికీ పింఛన్లు పెంచలేదంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. వైసీపీ నేతలు ఎక్కడకు వెళ్లినా పింఛన్ల పెంపు సెగ తగులుతోంది.
ఈ సమాచారం అంతా సీఎంఓకు చేరుతోంది. దీనిపై త్వరలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం.