తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు సంబంధించి అదో పెద్ద వేడుక. దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి దక్కని ఘనతను సొంత చేసుకున్న టీఆర్ఎస్ దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. ఈ భవన నిర్మాణానికి గురువారం అట్టహాసంగా భూమి పూజ జరిగింది. పార్టీ అధినేత హోదాలో కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మంత్రి కేటీఆర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకు పార్టీలోని కీలక నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు కూడా హాజరయ్యారు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటి నడవడంతో పాటుగా పార్టీ పురోభివృద్ధికి ఏ ఒక్కరూ చేయనంత కృషి చేసిన కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీశ్ రావు మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేదు. ఓ వైపు ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవన భూమి పూజ వేడుకగా జరుగుతుంటే.. తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించిన హరీశ్ రావు మాత్రం తన సొంత నియోజకవర్గం సిద్దిపేటలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ విషయం ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది.
పిలుపు రాలేదా?.. వచ్చినా వెళ్లలేదా?
ఢిల్లీలో జరిగిన వేడుకకు సాధారణంగా పార్టీలోని అందరు కీలక నేతలకు ఆహ్వానం అందే ఉంటుంది. ఎందుకంటే.. దేశంలో ఏ ఒక్క పార్టీకి దక్కని ఘనతను టీఆర్ఎస్ దక్కించుకుంది కదా. మరి ఈ వేడుకకు పార్టీ ముఖ్యులతో పాటు ద్వితీయ శ్రేణిలో కూడా చాలా మంది నేతలు హాజరయ్యారు. వెరసి ఢిల్లీలో టీఆర్ఎస్ కోలాహలం కనిపించింది. ఈ వేడుకకు రావాలంటూ హరీశ్ రావుకు అసలు ఆహ్వానం అందిందా? లేదా? అన్న కోణంలో ఆసక్తికర చర్చకు తెర లేసింది. అంతేకాకుండా పార్టీ నుంచి ఆహ్వానం అందినా కూడా హరీశ్ రావే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారా? అన్న కోణంలోనూ చర్చ జరుగుతోంది. పార్టీ నుంచి ఆహ్వానం అందితే.. దానిని ఉపేక్షించే స్థితిలో హరీశ్ రావు లేరనే చెప్పాలి. కేసీఆర్ ఆదేశమే తనకు పరమావధి అన్నట్లుగా సాగు హరీశ.. కేసీఆర్ నుంచి ఆహ్వానం అందితే ఢిల్లీ ఫ్లైటెక్కకుండా ఉంటారా? అన్న దానిపైనా చర్చ సాగుతోంది. మొత్తంగా కారణం ఏమిటో తెలియదు గానీ.. ఈ కార్యక్రమంలో హరీశ్ రావు కనిపించని వైనం కొత్త తరహా చర్చలకు తెర లేపిందనే చెప్పాలి.
పార్టీ పనేమీ లేదు కదా
హుజూరాబాద్ కు త్వరలో జరగనున్న ఉప ఎన్నికల బాధ్యతలను హరీశ్ రావుకే అప్పగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ కూడా ఈ బాధ్యతల్లో ఉన్నా.. ఆ తర్వాత హరీశ్ రావును కేసీఆర్ రంగంలోకి దింపారు. ఉప ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కేసీఆర్ గతంలో ఎన్నడూ లేనంత మేర వ్యూహాలు రచిస్తున్నారు. ఈ వ్యూహాల అమలు బాధ్యత హరీశ్ రావు తీసుకున్నా.. గురువారం నాడు పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా తన నియోజకవర్గంలోనే ఉండిపోయిన హరీశ్.. హుజూరాబాద్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంటే.. ఏదో పని మీద హరీశ్ ను ఇక్కడే ఉంచి వెళ్లలేదనే చెప్పాలి. మరి పార్టీకి సంబంధించి ప్రత్యేక పనేమీ లేకున్నా కూడా హరీశ్ రావు ఢిల్లీ కార్యక్రమంలో పాలుపంచుకోని వైనం కలకలమే రేపుతోంది.