వచ్చే ఏడాదిలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సర్వేలు కూడా జోరందుకుంటున్నాయి. కొద్ది నెలలుగా ప్రస్తుతం ఉన్న జగన్ సర్కార్ గ్రాఫ్ అమాంతం పడిపోవడంతో వైఎస్ఆర్ సీపీకి ఆదరణ బాగా తగ్గిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అనూహ్యంగా టీడీపీ వైపే జనాలు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేసుకున్న రాజకీయ వ్యూహ సంస్థ ఐ ప్యాక్ సర్వేలో కూడా జగన్ కు షాకింగ్ ఫలితాలు ఎదురైన సంగతి తెలిసిందే. దీంతో ఇక ఈ పరిస్థితుల్లో చేసేది ఏమీ లేక జగన్ తోచినకాడికి జనాల్లోకి వెళ్లే కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ఆ కార్యక్రమాల్లో కూడా జనాలు లేక నిరాశాజనక ఫలితాలు కనిపిస్తుండడంతో ఎమ్మెల్యేల్లో కూడా మరింత నిరాశ పెరిగిపోయింది.
ఇదిలా ఉంటే తాజాగా చాణక్య అనే సర్వే సంస్థ రాజమహేంద్రవరానికి సంబంధించి సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఐఐఎం బెంగళూరులో అల్యుమ్నీ అయిన పార్థ దాస్ అనే ఎలక్షన్ రిజల్ట్ అనలిస్ట్ ఈ రాజమహేంద్రవరం అసెంబ్లీ, సాధారణ ఎన్నికల ఫలితాలను అంచనా వేశారు. అంతేకాక, సీఎం ఎవరైతే బాగుంటుందని రాజమహేంద్రవరం ప్రజలు కోరుకుంటున్నారో, భారత ప్రధానిగా ఎవరిని చూడాలనుకుంటున్నారో కూడా ఈ సర్వేలో పేర్కొన్నారు. సీఎం జగన్ సొంత వ్యూహసంస్థ ఐప్యాక్ ఫలితాల మాదిరిగానే ఈ సర్వేలో ఫలితాలు కూడా ఉండడం విశేషం. దీంతో అన్ని సర్వేలు టీడీపీకే జై కొడుతుండడంతో ఇక తాము ఓడిపోవడం ఖాయమని జగన్ అండ్ గ్యాంగ్ ఫిక్సయిపోయినట్లు తెలుస్తోంది.
రాజమహేంద్రవరం సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీడీపీకి 51 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. వైఎస్ఆర్ సీపీకి కేవలం 36 శాతం మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. అదే జనసేనకు 10 శాతం మాత్రమే ఓట్లు వస్తాయని సర్వేలో అంచనా వేశారు. ఇతరులకు మూడు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అదే పార్లమెంటు స్థానంలో టీడీపీకి 53 శాతం ఓట్లు, వైఎస్ఆర్ సీపీకి 38 శాతం ఓట్లు, జనసేనకు 6 శాతం, కాంగ్రెస్ కి మూడు శాతం ఓట్లు వస్తాయని సర్వేలో అంచనా వేశారు. ఇటీవల చంద్రబాబు అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉంచారు. అక్కడి పరిస్థితులను ప్రజలు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి.. వైసీపీ పట్ల ప్రజల్లో బాగా వ్యతిరేకత పెంచేసుకున్నారని అర్థం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారనే విషయంలో 38 శాతం మంది చంద్రబాబు నాయుడినే ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. మరో విశేషం ఏంటంటే ఇంకో 38 శాతం మంది కూడా జగన్ ను సీఎంగా చూడాలనుకుంటున్నారట. లోకేశ్ సీఎం అయితే 15 శాతం.. పవన్ కల్యాణ్ను సీఎంగా మరో 10 శాతం మంది కోరుకుంటున్నారు. ప్రధానిగా రాహుల్ గాంధీని 43 శాతం మంది కోరుకుంటున్నారు. ప్రధానిగా మోదీని 40 శాతం మంది మాత్రమే ఆశిస్తున్నారు. ప్రధానిగా ఇప్పుడున్నవారు ఎవరూ నచ్చలేదనే వారు 18 శాతం మంది అభిప్రాయపడినట్లుగా సర్వే స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి.. రాజమహేంద్రవరం అసెంబ్లీ స్థానంలో 60 శాతానికి పైగా ఓట్లు ఈ కూటమికి దక్కనున్నాయన్నమాట.