ఏపీలో N440K కొత్త వేరియంట్ ప్రవేశించిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఛైర్మన్ జవహర్రెడ్డి తెలిపారు. ఏపీలో కరోనా కొత్త వేరియంట్ N440K కల్లోలం సృష్టిస్తోందని కొద్ది రోజుల కిందట సీసీఎంబీ కర్నూలు జిల్లాలో నిర్వహించిన సర్వేలో తేలిందని ప్రకటించింది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమని, అందుకే కరోనా సెకండ్ వేవ్లో మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో జరిపిన శాంపిల్ సర్వే ఆధారంగా సీసీఎంబీ నివేదికను తయారు చేసింది.ఈ కొత్త వేరియంట్ చాలా ప్రమాదకరమని కూడా సీసీఎంబీ ప్రకటించింది. దీనిపై మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి. ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు కూడా కొత్త వేరియంట్పై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇవాళ ఓ ప్రకటన చేసింది.
అలాంటిదేం లేదు..
ఏపీలో N440K కొత్త వేరియంట్ పై వివరాలను జవహర్రెడ్డి మీడియాకు వెల్లడించారు.గత ఏడాది జూన్, జులైలో ఈ స్ట్రెయిన్ను ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సీసీఎంబీ గుర్తించిందని ఆయన తెలిపారు. ఆ తరవాత 2021 ఫిబ్రవరి నాటికి క్రమంగా తగ్గిందన్నారు. ఇప్పుడు ఈ రకం వైరస్ చాలా తక్కువగా గుర్తిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో సేకరించిన నమూనాల్లో బి.1.617, బి1 గుర్తించినట్టు తెలిపారు. ఇది యువకుల్లో కూడా చాలా త్వరగా వ్యాపిస్తోందని జవహర్రెడ్డి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బి.1.617ను వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్గా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. అయితే N440Kపై ఎలాంటి ప్రస్తావన చేయలేదని జవహర్రెడ్డి ఇవాళ మీడియాకు వెల్లడించారు.