ఏపీ మంత్రి రోజా ఈసారి ఎన్నికల్లో ఓడిపోయే సంకేతాలు మరోసారి కనిపించాయి. ఆమెకు తన నగిరి నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ ఏ మాత్రం మద్దతుగా లేని సంగతి తెలిసిందే. ఆ మధ్య రోజాపై జడ్పీటీసీ చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. జడ్పీ సమావేశంలో జడ్పీటీసీ సభ్యురాలు రోజాకు వ్యతిరేకంగా.. ఆమెకు టికెట్ ఇవ్వొద్దంటూ మాట్లాడారు. ఆమెకు టికెట్ ఇస్తే ఓడిస్తామని తేల్చి చెప్పేశారు. అలా ఏదో ఒక సందర్భంలో సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే రోజాకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. దీంతో రోజురోజుకు మంత్రిపై అసంతృప్తి సెగలు పెరుగుతున్నాయి.
తాజాగా మంత్రి రోజాకు మరో అవమానం ఎదురైంది. వడమాలపేట మండలం అప్పలాయిగుంటలో సచివాలయం పత్తిపుత్తూరులో రైతు భరోసా కేంద్రం, జగనన్న పాలసేకరణ కేంద్రాలను మంత్రి రోజా త్వరలోనే ప్రారంభించాలని అనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి ఆదివారం ఈ మూడు కార్యాలయాలను ప్రారంభించేశారు. మంత్రి పదవిలో ఉన్న రోజా రాకముందే ఇలా చేసేయడంతో.. ఆమెకు అవమానం కలిగినట్లయింది. గతంలోనూ పత్తిపుత్తూరులో సచివాలయ భవనం ప్రారంభానికి మంత్రి రోజా ఏర్పాట్లు చేసుకోగా.. తనకు బిల్లులు ఇవ్వకుండా ప్రారంభం చేయకూడదంటూ మురళీధర్ రెడ్డి దానికి తాళం వేసేశారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య విభేదాలు తార స్థాయిలో రచ్చకెక్కుతున్నాయి.
తనకు ఇలా ఝలక్ లు ఇస్తున్నందున మురళీధర్ రెడ్డితో పాటు పుత్తూరుకు చెందిన వైసీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఏలుమలై, ఈడిగ కార్పొరేషన్ ఛైర్మన్ కేజే శాంతి, నగరి పురపాలిక మాజీ ఛైర్మన్ కేజే కుమార్, నిండ్రకు చెందిన శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ చక్రపాణిరెడ్డి, విజయపురానికి చెందిన లక్ష్మీపతిరాజు తదితరులను మంత్రి రోజా కొన్నాళ్లుగా దూరం పెట్టారు. నియోజకవర్గంలో అందరితోనూ మంత్రి రోజాకు ప్రస్తుతం విభేదాలు ఉన్నాయి. రోజా వ్యతిరేక వర్గానికి మంత్రి పెద్దిరెడ్డి అండదండలు ఉన్నాయని చెబుతున్నారు. మంత్రి రోజాపై అసమ్మతి వ్యక్తం చేస్తున్న ఈ ఐదుగురు నేతలు గతంలో రోజా విజయానికి పనిచేసిన వారే కావడం విశేషం. కానీ తర్వాత రోజా వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం.. దందాల్లో వాటాల్లో కూడా తేడా కొట్టిందని ఆరోపణలు ఉన్నాయి. అందుకే విభేదాలు మరోస్థాయికి వెళ్లి.. మంత్రికి తెలియకుండా నియోజకవర్గంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాలు తరచూ జరుగుతున్నాయి.
నగిరి నియోజకవర్గంలో వైసీపీ తరపున రోజా వరుసగా రెండుసార్లు గెలిచారు. మంత్రి రోజా ఇతర నేతలు సమష్టిగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం వైసీపీలోనే చీలికలు ఉండడంతో మంత్రి రోజా టెన్షన్ పడుతున్నారు. కనీసం అధిష్ఠానం కూడా నగిరిలో సమస్యను పరిష్కరించడం లేదు. రోజాను నగిరి నుంచి తప్పించి.. ఆ ఐదుగురు నేతల్లో ఒకరికి ఈసారి వైసీపీ టికెట్ వస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. మంత్రి పెద్దిరెడ్డి సపోర్ట్ కూడా ఉండడంతో ఆ ఐదుగురిలో ఒకరికి టికెట్ దక్కడం ఈసారి ఖాయంగా కనిపిస్తోంది.











