సీఎం జగన్మోహన్ రెడ్డి మాటతప్పి, మడమ తిప్పి నేటికి సరిగ్గా 300 రోజులు అయిందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. అమరావతి ఉద్యమం 300 రోజులు అయిన సందర్బంగా లోకేష్ రాజధానిలోని పలు గ్రామాల్లో పర్యటించారు. రైతుల త్యాగాలు ఊరికే పోవని, రాజధానిని అమరావతి నుంచి అంగుళం కూడా కదల్చలేరని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. నారా లోకేష్ పర్యటనతో రాజధాని గ్రామాల్లో ఉద్యమానికి ఊపొచ్చింది.
వోక్స్ వ్యాగన్ మంత్రి ఏమంటాడు
అమరావతి రాజధాని పసిబిడ్డను చంపడానికి అనేక ఆరోపణలు చేశారని పెనుమాకలో జరిగిన కార్యక్రమంలో నారా లోకేష్ దుయ్యబట్టారు. ముందుగా అమరావతిని చంపడానికి వోక్స్ వ్యాగన్ మంత్రి అంతా గ్రాఫిక్స్ అన్నారని, అమరావతిలో కట్టిన భవనాలు గ్రాఫిక్స్ అయితే వాటిపై ఎక్కిదూకాలని సవాల్ విసిరినా ఆ మంత్రి ముందుకు రాలేదని లోకేష్ ఎద్దేవా చేశారు. అమరావతిని చంపడానికి వరదల్లో మునగిపోతుందన్నారని, మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం వర్షాలు కురిశాయని, అయినా రాజధానిలోకి చుక్కనీరు రాలేదని ఆయన గుర్తుచేశారు. మరో వైసీపీ నేత రాజధానికి ఏకంగా స్మశానంతో పోల్చారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ గ్రామానా ఉద్యమం
అమరావతిలో గ్రామ గ్రామానా ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. రైతులు, రైతు సంఘాలు, దళిత సంఘాలు, కూలీలు ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా టీడీపీ నాయకులు కూడా పాల్గొనడంతో ఉద్యమానికి మరింత ఊపు వచ్చింది. అమరావతి 300 రోజుల ఉద్యమంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, గుంటూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో పాటు పలువురు టీడీపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. పెనుమాక నుంచి ప్రారంభమైన టీడీపీ నేతల యాత్ర రాత్రికి తుళ్లూరుకు చేరనుంది.
కూలీలు రోడ్డున పడ్డారు
జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక నిర్మాణ రంగ కూలీలకు ఉపాధి లేక రోడ్డునపడ్డారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. రాష్ట్రానికి కొత్తగా ఒక్కపరిశ్రమ రాకపోగా, ఉన్న పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. జగన్ సీఎం అయ్యాక పరిశ్రమలు తరలిపోయాయి. ఉద్యోగాలు లేవు. ఉపాధి దొరకడం లేదని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ కృష్ణాయపాలెంలో విమర్శించారు. ఏపీని కరోనాలో మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ చేయగలిగారని లోకేష్ ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని లోకేష్ గుర్తుచేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఏపీ మధ్యలో ఉన్న అమరావతి రాజధానికి అంగుళం కూడా కదల్చలేరని లోకేష్ స్పష్టం చేశారు.
రాజధాని అమరావతి కోసం రైతులు, రైతు కూలీలు, మహిళలు 300 రోజులుగా చేస్తోన్న పోరాటానికి మద్దతుగా.. రాజధాని గ్రామాలలో నా పర్యటన పెనుమాక గ్రామం నుంచి మొదలయ్యింది. (1/2)#300DaysForOneCapital pic.twitter.com/BQSSvqpg7m
— Lokesh Nara (@naralokesh) October 12, 2020
ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆటంకాలు కలిగిస్తున్నా వెనుకాడని రాజధాని రైతుల సాహసం స్ఫూర్తినిస్తోంది. (2/2)#300DaysForOneCapital pic.twitter.com/AzORsG7LKZ
— Lokesh Nara (@naralokesh) October 12, 2020











