గత కొంత కాలంగా భారతీయ సినీ పరిశ్రమలో నిజ జీవిత కథలు వెండి తెరపై దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే యన్టీఆర్, సావిత్రి జీవిత కథలు తెలుగు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందాల నటుడు శోభన్ బాబు జీవిత కథ కూడా సినిమాగా రూపొందనుందని సమాచారం. అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు శోభన్ బాబు. ‘దైవబలం’ సినిమాతో నటుడిగా ప్రవేశించి.. ‘భక్త శబరి’ సినిమాలో మునికుమారునిగా నటించారు శోభన్. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలలో కూడా నటించారు.
‘వీరాభిమన్యు’ మూవీతో స్టార్ డమ్ తెచ్చుకున్న శోభన్.. అనతి కాలంలోనే అగ్ర హీరోగా ఎదిగారు. ‘సోగ్గాడు, దేవత, పండంటి కాపురం, కార్తీక దీపం, ఇల్లాలు ప్రియురాలు, కొంగుముడి, ఉమ్మడి మొగుడు, భార్యాభర్తలు’ లాంటి సినిమాలతో కుటుంబ ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడయ్యారు. ఆయన కుటుంబ చిత్రాల్లోనే కాకుండా యాక్షన్, రొమాంటిక్ మూవీస్ లోనూ నటించి మెప్పించారు. అప్పట్లో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తరహాలో శోభన్ బాబు కూడా ప్రత్యేక అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు.
ఆయన ఎంత పెద్ద హీరో అయిన ఎటువంటి భేషజాలు లేకుండా సాటి హీరోలతో కలసి నటించేవాడు. అలాంటి ఈ హీరో జీవిత కథ వెండి తెరపై ప్రేక్షకులకు కనువిందు చేయబోతుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో మొదలవుతుందని, హీరోగా రానా దగ్గుపాటిని ఎంచుకున్నారని ఫిలింనగర్ టాక్.
ప్రస్తుతం రానా నటిస్తున్న సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమాలు పూర్తి చేసి శోభన్ బాబు బయోపిక్ షూటింగ్ లో రానా జాయిన్ అవుతాడని టాక్ నడుస్తుంది. శోభన్ బాబు బయోపిక్ తెరకెక్కడం ఖాయంగా కనపడుతుంది, మరి ఈ సినిమాకి దర్శకుడెవరో ? అందులో రానా నటిస్తాడో లేదో చూడాలి.











