వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే వ్యూహంలో భాగంగా ఎంతో మంది ఎమ్మెల్యేలు తమకు టికెట్ దక్కదేమోననే బెంగతో ఉన్నారు. అధికారిక ప్రకటన రాగానే వారు రెబల్ గా మారే యోచనలోనూ ఉన్నారు. ఇంకా కొంత మంది ఎమ్మెల్యేల విషయంలో వారికి స్థాన చలనం కల్పించాలని కూడా జగన్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఇలా జరిగితే కనుక ఎమ్మెల్యేలు మరో సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే నాన్ లోకల్ సమస్య. ఇన్ని ఏళ్లుగా వారు ఒక నియోజకవర్గానికి పరిమితమై ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొంత మంది అయితే, వరుసగా పది పదిహేనేళ్ల పాటు ఒకే నియోజకవర్గాల్లోని ప్రజలతో మమేకమై వారిని బుట్టలో వేసుకొనేందుకు ప్రయత్నించారు. కానీ, ఓటమి భయంతో సిట్టింగ్ లకు సీట్లు కేటాయించకపోవడం, లేదా వారిని మరో స్థానం నుంచి పోటీ చేసేలా అధిష్ఠానం ఆదేశిస్తే అభ్యర్థులకు కష్టం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కొత్త నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి ముఖాన్ని జనం అంత త్వరగా రిజిస్టర్ చేసుకోలేరు. పైగా సిట్టింగ్ నియోజకవర్గంలో కింది స్థాయి పార్టీ శ్రేణులతో ఉండే అనుబంధం వేరు. కొత్త నియోజకవర్గంలో.. పార్టీ క్యాడర్ అంతగా సహకరించకపోవచ్చు. ప్రజల్లోకి వెళ్తే వచ్చే ఆదరణ కూడా సిట్టింగ్ నియోజకవర్గంతో పోల్చితే కొత్త చోట కాస్త కష్టమే. ఇలా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు భయపడుతున్నారు. ఇవే నష్టంగా పరిణమిస్తే జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన వ్యూహానికి అర్థమే లేకుండా పోతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జగన్ ఈ పరిస్థితి కల్పిస్తే తమ పని అంతే అనే టెన్షన్ లో అభ్యర్థులు ఉన్నారు.
వైసీపీ వర్గాలు చెబుతున్న ప్రకారం అయితే.. దాదాపు 60కి పైగా స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులకు ఈసారి టికెట్ ఇవ్వడం లేదు. సర్వేల్లో వ్యతిరేకత ఉండడం వల్లే దాన్ని ప్రాతిపదికగా తీసుకొని అభ్యర్థులను మార్చడానికి జగన్మోహన్ రెడ్డి అస్సలు వెనుకాడడం లేదు. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా మందికి టికెట్లు ఇవ్వనని తేల్చి చెప్పినట్టు సమాచారం. టికెట్లు దక్కని నేతల్లో మంత్రులు కూడా ఉండనున్న సంగతి తెలిసిందే. వారిలో మొదటి స్థానాల్లో మంత్రులు అంబటి రాంబాబు, రోజా తదితరులు ఉంటారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలను జగన్ గుణపాఠంగా భావించి.. అక్కడ కేసీఆర్ కు తగిలిన ఎదురుదెబ్బ తనకు తగలవద్దని జగన్ భావిస్తున్నారు. మొహమాటం కొద్దీ టికెట్లు ఇస్తూ పోతే, చివరికి ఓటమి మూటకట్టుకోవాల్సి వస్తుందని జగన్ ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
అందుకే టికెట్ల విషయంలో వైఎస్ జగన్ కఠినంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోసారి అధికారాన్ని దక్కించుకుంటే ఏదో ఒక పోస్టు దక్కుతుందని అసమ్మతి నేతలకు జగన్ సర్ది చెబుతున్నట్లు సమాచారం. వినకపోతే కనుక ఆళ్ల రామక్రిష్ణారెడ్డికి ఇచ్చినట్లుగానే పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తీసుకొనే ఈ భారీ మార్పులు పార్టీని ముంచుతాయో, ఒడ్డెక్కిస్తాయో వేచి చూడాలి.