ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో నవలలకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అప్పట్లో అత్యధికంగా నవలా చిత్రాల్లో నటించిన హీరోగా అక్కినేని నాగేశ్వరరావు ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ తర్వాత తరం హీరోల్లో చిరంజీవి ఎక్కువగా నవలా చిత్రాల్లో నటించారు. అభిలాష, ఛాలెంజ్, మరణమృదంగం, రాక్షసుడు, స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్, దొంగమొగుడు, చంటబ్బాయ్ లాంటి చిత్రాలన్నీ నవలల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి టాలీవుడ్ లో నవలలపై ఆసక్తి తగ్గుతూ వచ్చింది. ఇక ఇప్పటి తరంలో నవలా చిత్రాలు చాలా అరుదుగా వస్తున్నాయి. ఇప్పటి దర్శకులు రీమేక్స్ పై ఎక్కువ ఆసక్తి చూపుతుండడమే దానికి కారణం. అయితే టెక్నాలజీ కొత్త రూపు దాల్చిన ఈ ఆధునిక యుగంలో మళ్ళీ నవలలకి డిమాండ్ ఏర్పడుతోంది. అది కూడా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో.
ప్రస్తుతం వెబ్ సిరీస్ కు డిమాండ్ బాగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అందులోనూ ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇళ్ళకే పరిమితమైన ప్రేక్షకులు ఓటీటీల్లో సినిమాలతో పాటు బాగా వీక్షిస్తున్నవి వెబ్ సిరీసే. ప్రస్తుతం వాటికి కూడా కథల కొరత ఏర్పడడంతో .. అందరి దృష్టి ఇప్పుడు నవలల మీద పడింది. ఒకప్పటి ఫేమస్ నవలల దుమ్ముదులిపి.. వెబ్ సిరీస్ రూపొందే ఆలోచనలో పలువురు దర్శకులున్నారు. అలాంటి నవలల్లో ముందుగా చెప్పుకోదగ్గది గుడిపాటి వెంకటచలం రచించిన ‘మైదానం’ నవల.
‘నీదీ నాదీ ఒకే కథ’తో దర్శకుడిగా పరిచయం అయిన వేణు ఊడుగుల ఇప్పుడు ‘విరాటపర్వం’ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అతడే ఇప్పుడు ‘మైదానం’ నవలను వెబ్ సిరీస్ రూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. వేణు నిర్మాతగా వ్యవహరించే ఈ వెబ్ సిరీస్ లో ఓ అగ్ర కథానాయిక నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆమె ఎవరన్నది, దీనికి దర్శకుడు ఎవరన్నదీ త్వరలో వెల్లడిస్తారు.
బండి నారాయణ స్వామి రాసిన `శప్తభూమి` నవల విమర్శకుల, విశ్లేషకుల, సాహితీ అభిమానుల ప్రశంసలు అందుకుంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఈ నవల ఇప్పుడు దృశ్యరూపంలో రాబోతోంది. ఈ నవలకు సంబంధించిన హక్కుల్ని ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ నవలకు స్క్రిప్టు రూపం ఇస్తున్నారు. “శప్తభూమి’ నవల బాగా నచ్చింది. దాన్ని వెబ్ సిరీస్గా తీయాలనుకుంటున్నానని ఆయన ఇటీవలే చెప్పారు.
ఇక ఒకప్పుడు తన నవలలతో ఎందరో పాఠకుల్ని అబ్బుర పరిచిన డైనమిక్ రైటర్ మధుబాబు. ముఖ్యంగా ఆయన రాసిన ‘షాడో’ స్పై అడ్వెంచర్స్ ను ఎవరూ మరిచిపోలేరు. ఇప్పటికీ ఆ సిరిస్ కు ఎంతో మంది అభిమానులున్నారు. ఇప్పటి జెనరేషన్ కు వాటి గొప్పతనం తెలుసుకొనే సమయం ఆసన్నమైంది. త్వరలోనే ‘షాడో’ సిరీస్ వెబ్ సిరీస్ రూపంలో రాబోతున్నాయి.
ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఇటీవలే దానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అలాగే ‘షాడో’ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. మధుబాబే స్వయంగా ఈ వెబ్ సిరీస్ కు స్ర్కిప్ట్ వర్క్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి దర్శకుడు ఎవరు? షాడో గా ఎవరు నటిస్తున్నారు అనే వివరాలు ఇంకా తెలియలేదు. ఇంకా మరికొన్ని నవలలు వెబ్ సిరీస్ గా రూపుదిద్దుకుంటున్నాయి. మరి వీటిలో ఏ నవలలు వెబ్ సిరీస్ గా సక్సెస్ అవుతాయో చూడాలి.











