గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎంతో మంది చేపట్టారు. కానీ బండి సంజయ్ అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాతనే ఆ పార్టీకి మైలేజీ పెరిగిందనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. అప్పటి పరిస్థితులు.. ప్రస్తుత పరిస్థితులు ఎలాగున్నా కానీ.. ఇదే నిజమనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. సంజయ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ఒక్కసారిగా దూకుడు పెంచేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూ టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని జనాలు చర్చించుకునేలా బండి సంజయ్ సక్సెస్ సాధించారనే చెప్పాలి. ఇందులో తమ పార్టీ నేతల భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఆ క్రెడిట్లో ఎక్కువ భాగం ఎంత లేదన్నా బండి సంజయ్కే దక్కుతోంది.
ముందు నుంచి దూకుడే…
దుబ్బాక ఉప ఎన్నిక విజయం సాధించడంలో పార్టీ సమిష్టి కృషి.. దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీపై బండి సంజయ్ దూకుడుగా వ్యవహరించడం ఆ పార్టీ విజయానికి చాలా ప్లస్ అయ్యింది. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్లను తనదైన స్టైల్లో ధీటుగా బదులిస్తూ దుబ్బాక వైపు అందరి దృష్టిని ఆకర్షించేలా చేయడంలో బండి సంజయ్ నాయకత్వం సక్సెస్ అయ్యింది. కేవలం బీజేపీ హైదరాబాద్కే పరిమితం, పల్లెల్లో బీజేపీకి అసలు క్యాడరే లేదనే భావన గతంలో ఉండేది. అలాంటిది టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని ఉప ఎన్నికలో గెలుచుకోవడం అంటే మాములు విషయం కాదు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ చర్చ మొదలైంది. కాంగ్రెస్ పని అయిపోయిందా? టీఆర్ఎస్ కు బీజేపీయే ఇక ప్రత్యామ్నాయమా? అనేలా రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రంలో మార్పులు చోటుచేసుకున్నాయి. బీజేపీ అభ్యర్థి అయిన రఘునందన్రావుకు జనంలో మంచి పేరు ఉండడం దానికి తోడు బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్న నేత రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టడం లాంటి అంశాలు దుబ్బాకలో బీజేపీ విజయానికి బాటలు వేశాయని చెప్పాలి.
అదే వ్యూహంతో…
దుబ్బాక విజయంతో ఊపుమీదున్న బీజేపీ నాయకత్వం.. గ్రేటర్ ఎన్నికల్లోనూ అదే సత్తా చాటేలా ముందు నుంచి ప్రణాళికలు రచించింది. హైదరాబాద్ వరదలు, వరద సాయం అందజేయడంలో ప్రభుత్వ విఫలం, డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం, హైదరాబాద్ అభివృద్ధిలో టీఆర్ఎస్ ప్రభుత్వ విఫలం లాంటి అంశాలను ఎన్నికల్లో అస్త్రాలుగా మలుచుకొని ఎన్నికల బరిలో అధికార పార్టీతో ధీటుగా పోటీపడ్డారు. అక్కడక్కడ డబ్బు పంపిణీ చేసిన ఇతర పార్టీ నేతలను బీజేపీ శ్రేణులు ధైర్యంగా అడ్డుకున్నారు. ఏకంగా మంత్రి పువ్వాడ కారునే అడ్డగించారంటే బీజేపీ కార్యకర్తలు ఈ ఎన్నికల్లో ఎంత ఉత్సాహంగా పనిచేశారో అర్థమవుతోంది. గత ఎన్నికల్లో ఇలాంటి పరిస్థి ఉండేది కాదు. ఎన్నికల్లో పోటీ చేయడానికే అభ్యర్థులను వెతుక్కునే పరిస్థితి. కానీ బండి సంజయ్ పగ్గాలు చేప్టిన తరువాత టిక్కెట్ల కోసం అధికార, కాంగ్రెస్ పార్టీల నేతలు బీజేపీకి క్యూ కట్టారు. ఈ సారి 149 వార్డుల్లో ఎన్నికల అభ్యర్థులను బీజేపీ నిలబెట్టి గ్రేటర్ వ్యాప్తంగా ప్రచారం చేసింది. ఏకంగా జాతీయ నాయకత్వాన్ని రంగంలోకి దింపి ప్రచారం చేయించింది. బీజేపీ ఎన్నికల ప్రచార తీరు గత ఎన్నికలకు పూర్తిగా భిన్నంగా సాగింది. భారీ ర్యాలీలు, రోడ్ షోలలో కార్యకర్తలు భారీగా పాల్గొనడం, వాడీవేడి ప్రసంగాలతో సరికొత్తగా సాగింది. ఈసారి యువత కూడా చాలా మంది బీజేపీ వైపు మొగ్గుచూపారు. గ్రేటర్ లో బీజేపీ ప్రదర్శించిన దూకుడు రాష్ట్ర వాప్తంగా చర్చకు దారితీసింది. ఒక చేత్తో అధికార పార్టీని, మరోక చేత్తో ఎంఐఎం పార్టీ నేతల విమర్శలను తిప్పికొట్టడంలో బండి సంజయ్ క్రెడిట్ సాధించారని ఎవరూ కూడా కాదనని నిజం.
బండికి ప్రధాని ఫోన్…
గ్రేటర్ ఎన్నికల్లో చూపించి తెగువకు బండి సంజయ్కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి గ్రేటర్ ఎన్నికలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల స్థితిగతులపై ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు ఎన్నికల సరళిపై పార్టీ పరిస్థితులపై బండి సంజయ్తో ముచ్చటించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కార్యకర్తలు అధ్బుతంగా పోరాటం చేశారని బండి సంజయ్ను మోడీ అభినందించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపైన జరిగిన దౌర్జన్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ముందుకు పోవాలని, అన్ని విధాలా అండగా ఉంటామని ప్రధాని మోడీ బండి సంజయ్కు హామీ ఇచ్చినట్లు తెలిసింది. నూతనోత్సాహంతో పార్టీ క్యాడర్ ఎన్నికల్లో నడుచుకోవడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ నాయకత్వం, కార్యకర్తల పోరాట పటిమను మోడీ కొనియాడారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని బండి సంజయ్కు మోడీ దిశానిర్ధేశం చేసినట్లు తెలిసింది.
అప్పుడు అమిత్ షా…
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తరువాత బండి సంజయ్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అప్పట్లో ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సంజయ్పై దాడి జరిగినప్పుడు కూడా ఆయనకు అమిత్షా ఫోన్ చేసి దాడి వివరాలను అడిగి తెలుసుకుని ధైర్యంగా ముందుకు పోవాలని రాష్ట్రంలో పార్టీకి అండగా ఉంటామని సంజయ్ తో అమిత్ షా చెప్పారు. మళ్లీప్పుడు గ్రేటర్ ఎన్నికలపై ప్రధాని నరేంద్రమోడీ నేరుగా బండి సంజయ్కు ఫోన్ చేసి మెచ్చుకోవడం విశేషం.
గ్రేటర్ లో గెలుపోటములు ఎలా ఉన్నప్పటికినీ కాంగ్రెస్ పార్టీని వెనక్కు నెట్టి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అనుకునేలా జనం దృష్టిని ఆకర్షించడంలో బండ్ సంజయ్ దాదాపుగా సక్సెస్ అయ్యారు.











