అధికారంలోకి వచ్చేంత వరకు రైతులకే మా మొదటి ప్రాధాన్యత అని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రైతుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అప్పుడు మాటలు చెప్పింది వీరేనా అనే సందేహం తప్పక వస్తుంది. రాష్ట్రానికి మూడు రాజధానులు వద్దు అని గత 319 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నప్పటికీ కనీసం రైతుల గోడు వినని ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా అని రైతులు అనుకుంటున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అధికార పక్షం.
రాజధాని కోసం పోరాటం చేస్తుంటే కనీసం అన్నం పెట్టే రైతుల చేతులు అని చూడకుండా కరుడుగట్టిన నేరస్థుల చేతులకు వేసినట్లు బేడీలు వేసి తీసుకెళ్లిందే కాక ప్రశ్నించినవారిని అక్రమంగా అరెస్ట్ చేయడం మీకు ఎంత వరకు సబబు అనిపిస్తుంది అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా మీరు మాకు ఇస్తాను అన్న రాజ్యం. ఇదేనా మీరు అన్నదాతలకు ఇచ్చే మర్యాద.
ఇన్ని రోజుల నుంచి మహిళలు తమ పోరాటాన్ని సాగిస్తుంటే వారితో పోలీసులు ప్రవర్తించే తీరు ఇదేనా..? జుట్టు పట్టుకుని పోలీసు వాహనాల్లోకి ఎక్కిస్తున్నారు. ఇదేక్కడి న్యాయమండి. మహిళ రైతుల పట్ల ఇంత అనాగరికంగా వ్యవహారిస్తారా..? శాంతియుతంగా నిరసన చేపట్టిన వారిపై లాఠీ ఛార్జీ చేసేందే కాకుండా.. వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కిస్తున్నారు. రోడ్డు పై బైఠాయించిన వారిని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్తున్నారు. వారు మహిళ రైతులని పోలీసులు మరిచిపోయారా? లేక ప్రభుత్వమే మరిచిపోయిందా? అంటూ మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పోలీసులే అవసరం లేని చోట ఏకంగా సీఆర్పీఎఫ్ బృందాలను రప్పించి మరి రైతులను చెదరగొడుతున్నారు. అనవసరంగా పోలీసు బలగాలను రంగంలోకి దింపి రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంది మీ ప్రభుత్వమే అంటూ రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా మా వద్దకు వచ్చి సమాధానం చెప్పలేదు. ఇదేనా మీరు రైతులకు ఇచ్చే మర్యాద అంటూ నిరసనలో పాల్గొన్న రైతులు ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ప్రకటించడం ఏమిటి అసలు? దీనికి సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదపడం లేదంటూ అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. మేము ఉద్యమాలు చేస్తుంటే మీ పదవులు పోతాయని భయపడుతున్నారా? లేక ప్రభుత్వమే కూలిపోతుందని ఆలోచిస్తున్నారా అంటూ మహిళా రైతులు అడుగుతున్నారు.
రైతులకే మా పూర్తి మద్దతు అని తెలిపిన మీరు ఇప్పుడు అరెస్టులు చేయిస్తుంది, కేసులు పెడుతుంది రైతుల మీద అన్న విషయాన్ని మరిచిపోతున్నట్లున్నారంటూ రాజధాని రైతులు పేర్కొన్నారు. ‘మీకు అమ్మ, అక్క, భార్య, కూతుర్లు ఉన్నారు కదా. మీ ఇంట్లో ఆడవారి పట్ల కూడా మీరు ఇలాగే ప్రవర్తిస్తున్నారా?’ కనీసం ఆడవారు అని కూడా చూడకుండా ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారంటూ బాధిత మహిళ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆడవారికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.











