గుడివాడ కేసినో నిర్వహణపై విరుచుకపడ్డ బీజేపీ!
గుడివాడ కేసినో నిర్వహణపై ఏపీ బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. మంగళవారం గుడివాడ వెళ్లేందుకు బయల్దేరిన బీజేపీ నేతలు సోము వీర్రాజు, సీఎం రమేష్, మాధవ్, నారాయణ రెడ్డి లను పోలీసులు అడ్డుకున్నారు. గుడివాడలో సంక్రాంతి సంబరాలు ముగింపుకు వెళ్తున్నామని నేతలు తెలిపినప్పటికీ .. అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. కాగా గుడివాడలో సంక్రాంతి ముగింపు సంబరాలు నిర్వహించి తీరుతామని సోము స్పష్టం చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వంపై, మంత్రి కొడాలి నానిపై సోము ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, ధర్మం, సంస్కృతిని చూపిస్తామని ఆయన అన్నారు. సగం వస్త్రాలు కట్టుకుని చీర్గార్ల్స్ ను తీసుకురామని, వారు గడ్డం వ్యక్తులు వద్దనే ఎగుతారని సోము విమర్శించారు. ధర్మం అంటే గడ్డాలు పెంచుకోవడం, చేతులకు తాళ్లు కట్టుకోవడం కాదన్నారు. బట్టలు ఎలా ధరించాలో దేవుడికి కట్టే వస్త్రాలను చూసి నేర్చుకోవాలని సోము సూచించారు. పొడుగ్గా ఉండే గడ్డం వ్యక్తికి ధర్మం అంటే భయమని, అందుకే గుడివాడ వచ్చామని సోము వీర్రాజు పేర్కొన్నారు.