వైసీపీని, జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకున్న సినీ రంగం ప్రముఖుల్లో ఒక్కరు కూడా బాగుపడినట్లు దాఖలాలే లేవు. 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కాస్త బెట్టుపోయిన కొందరు సినీ ప్రముఖులు.. జగన్ ప్రభుత్వంలో మరింతగా ఇబ్బందులు పడాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. సినీ రంగంలోనే అగ్ర నిర్మాతలు, నటీనటులుగా చెప్పుకునేవారిని సైతం జగన్ మోహన్ రెడ్డి అవమానించిన తీరును అందరూ కళ్లారా చూశారు. జగన్ పాలనలో సినీ రంగ ప్రముఖులు పడిన బాధలతో చంద్రబాబే వెయ్యి రెట్లు బెటర్ అనుకునే స్థాయికి వచ్చేశారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం కావడంతో తెలుగు సినీ పరిశ్రమ మొత్తం హ్యాపీగా ఉంది.
2019కి ముందు జగన్ పై నమ్మకంతో, ఆయనేదో తమను ఉద్ధరిస్తాడనే ఉద్దేశంతో ఎంతో మంది సినీ ప్రముఖులు వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ 2019లో గెలవడంలో ఎంతో కొంత కీలక పాత్ర పోషించారు. వారిలో ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యావేత్త మోహన్ బాబుతో పాటు, జీవితా రాజశేఖర్, జయసుధ, అలీ, నటుడు పృథ్వీరాజ్, పోసాని క్రిష్ణ మురళి తదితర సినీ ప్రముఖులు ఉన్నారు. అయితే, వారిలో ఎవరినీ జగన్ చేరదీసిన పరిస్థితులు లేవు. ఆఖరికి మోహన్ బాబుతో బంధుత్వం ఉన్నప్పటికీ జగన్ ఆయన్ను కనీసం పట్టించుకోలేదు.
గతంలో టీడీపీ హాయాంలో ఫీజు రీఎంబర్స్ మెంట్ విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా నానా రాద్ధాంతం చేశారు మోహన్ బాబు. జగన్ కి సపోర్ట్ చేసినందున ఆయన సీఎం అయ్యాక ఏమైనా సాయం చేశాడా అంటే కనీసం మాట్లాడిన పాపాన పోలేదు. అందుకే మోహన్ బాబు దూరంగా ఉన్నారు. ఇటు పోసాని క్రిష్ణ మురళికి కుక్క బిస్కెట్ల మాదిరిగా ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పదవి ఇచ్చి.. టీడీపీ, లోకేశ్, చంద్రబాబును తిట్టే పనిని జగన్ అప్పగించారు. ఇక ఒళ్లు తెలియకుండా రెండ్రోజులకోసారి ప్రెస్ మీట్ పెట్టి.. శ్రుతి మించిన స్థాయిలో పోసాని తిట్టేవారు.
కట్ చేస్తే వైసీపీ అవమానకర రీతిలో పరాజయం పాలైంది. దీంతో పోసాని పత్తా లేకుండా పోయారు. నిన్న తన తప్పుతెలుసుకున్న అలీ పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించినట్లుగానే పోసాని క్రిష్ణ మురళి కూడా వైసీపీకి రాజీనామా చేస్తారని అంటున్నారు. ఎందుకంటే పోసాని తీరు వల్ల ఇప్పటికే సినిమా అవకాశాలను కూడా పూర్తిగా పోగొట్టుకున్నారు. కనీసం ముందస్తు ఆలోచన లేకుండా పవన్ కల్యాణ్ ను అనరాని మాటలు అని మొత్తం టాలీవుడ్కే ఇప్పుడు శత్రువుగా మారారు. దీంతో చేసిన తప్పు తెలుసుకొని వైసీపీకి రాజీనామా చేస్తారని భావిస్తున్నారు.