(విశాఖపట్నం నుంచి లియో ప్రత్యేకప్రతినిధి)
పెట్టుకోక పెట్టుకోక ఏ2 హోదా ఉన్న ఓ మహా నేత తో విశాఖలోని వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒకరు పెట్టుకున్నారు. ఇంకేముంది … పర్యవసానంగా ఆ నాయకుడిపై వేటు పడింది. పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించినప్పటి నుంచి అధికార పార్టీ భూ దందాలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి . ఈ తరుణంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు కొయ్య ప్రసాద్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి పేరిట భూవ్యవహారం నడుపుతున్నట్టు వెలుగులోకి రావడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

అసలే ఈ మధ్య రెడ్డి గారి మీద రకరకాల ఆరోపణలు వస్తున్న సమయంలో ఈ భూ దందా వ్యవహారం అదనపు తలనొప్పిగా మారకముందే పార్టీ తగిన చర్యలు తీసుకుంది. విజయసాయిరెడ్డి మీద ఎన్ని రకాల ఆరోపణలొస్తున్నా జగన్మోహన రెడ్డి ఉపేక్షిస్తున్నారనే ప్రచారం ఉంది. ఆయన జోలికి వెళ్లేందుకు.. ఎంతటి వారైనా సరే భయపడుతున్న కాలంలో అడ్డగోలుగా రెడ్డి గారి పేరును వాడుకుందాం అనుకున్న ఓ నేత కు బుద్ధి చెప్పడం బానే ఉంది. కానీ,…. ఈ తరహా చర్యలు, అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్న అందరి పట్ల ఇదే రీతిలో చర్యలు ఉంటాయా? అన్న ప్రశ్న అధికార పక్షంలోనూ విపక్షాలలోనూ వినిపిస్తోంది.
‘బాబును కలవండి’
ఎందుకంటే మహా విశాఖలో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల వారసులు యథేచ్ఛగా అనేక రకాల దందాలు చేసుకుంటూ పోతున్నారు. పైకి ఎంత పారదర్శకంగా, నీతిమంతులుగా కనిపిస్తున్నప్పటికీ, తెరచాటు బాగోతాలు సవ్యంగానే సాగుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే కొడుకు ప్రస్తుతం ఆ ప్రాంతంలో చక్రం తిప్పుతున్నాడు. ఎటువంటి పంచాయితీ లైనా, సెటిల్మెంట్ లైనా ఈయన చేతుల మీదుగానే సాగుతున్నాయి. ఎమ్మెల్యే వద్దకు ఎవరు ఏ పనిమీద వెళ్ళినా ‘బాబును కలవండి’ అని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. దీంతో ఇటు అధికారుల లోనూ, అటు ప్రజల్లోనూ ఎమ్మెల్యేగా యువ నాయకుడి హవా కొనసాగుతోంది. ఎటువంటి సెటిల్మెంట్ నైనా క్షణాల్లో చక్కబెట్టే నైపుణ్యాన్ని ఇతగాడు సంపాదించాడు. ఇతని అనుచరగణం భూ ఆక్రమణలోనూ చక్రం తిప్పుతూ తమ నాయకుడికి యథోశక్తి సహకరిస్తూనే ఉన్నారు.
లంచాలు తిరిగివ్వాలంటే ఎవరికైనా నొప్పే..
నగర శివారులోని మరో నియోజకవర్గంలో ఓ యువ ఎమ్మెల్యే విషయానికి వస్తే…. ఇద్దరు బంధువులు ఈయన గారి తరపున రంగంలోకి దిగి పనులు చక్కబెట్టుకుంటున్నారు. గతంలో ఈపీడీసీఎల్ లో పలు పోస్టుల భర్తీ విషయంలో ఎమ్మెల్యే అనుచరులు ఉద్యోగాల పేరిట గట్టిగానే దండేసినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం ఎమ్మెల్యే సాక్షిగానే జరిగింది. తీరా పోస్టుల భర్తీ విషయానికి వచ్చేసరికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో ఆ యువ ఎమ్మెల్యే కు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది.
సుమారు కోటి రూపాయల వరకు చేసిన వసూళ్లను ఇప్పుడు విడతలవారీగా తీర్చుకుంటూ వస్తున్నట్టు సమాచారం. వీరిలో ఏ ఒక్కరు ఎదురుతిరిగినా, ఎమ్మెల్యే వ్యవహారం అధిష్టానం దృష్టికి వెళుతుందని భయం కారణంగానే ఈ చెల్లింపులు చేస్తున్నట్టు స్పష్టమౌతున్నది. ఇలా చెప్పుకుంటూ పోతే వైసిపి ద్వితీయశ్రేణి , తృతీయ శ్రేణి నాయకుల దందాలు అనేకం ఉన్నాయి. వీటిలో ఎమ్మెల్యేల అండదండలు కొందరికి ఉంటే, చూసీచూడనట్టు వదిలేస్తున్న వారు మరికొందరు.
కొయ్య ప్రసాద్ రెడ్డి పై చర్యలు తీసుకున్నట్టు ప్రతి ఒక్కరి పైన పార్టీ అధిష్టానం వేటు వేసే పరిస్థితి వస్తే ఒక్క విశాఖలోనే పార్టీ 50 శాతం ఖాళీ అవుతుందన్నది ప్రతిపక్షాల ఆరోపణ. రెడ్డిగారి వ్యవహారంలో మరో ఇద్దరు ముగ్గురు వైసీపీ నాయకుల పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం లో ఉంది. వారిపై కూడా త్వరలో చర్యలు తీసుకుంటారని భోగట్టా. మొత్తంగా A2 జోలికి వెళ్తే మటాష్ అన్న సంకేతాలు మాత్రం పార్టీ క్యాడర్ కు ఇవ్వడంలో అధిష్ఠానం సఫలం అయ్యారనే చెప్పాలి.











