డైనమిక్ డైరెక్టర్ ప్రస్తుతం ‘ఫైటర్’ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా తర్వాత పూరీ, మరో పాన్ ఇండియా సినిమాకు దర్శకత్వం వహిస్తాడని టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఇప్పటికే ఆయన ఒక కథను కూడా సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాను మరో క్రేజీ స్టార్ హీరోతో తెరకెక్కిస్తాడని సమాచారం. ఆ స్టార్ హీరో ఎవరో కాదు కన్నడ సూపర్ స్టార్ యశ్. ‘కేజియఫ్’ సినిమాతో యశ్ ఇండియన్ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా విడుదలైన ప్రతీ చోట బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి మంచి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం యశ్ ‘కేజీఎఫ్-2’లో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అవ్వవలసిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. ఈ మధ్యనే ‘కేజీఎఫ్-2’ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది.
ఈ సినిమా తర్వాత యశ్ పూరీతో సినిమా చేయనున్నాడని సమాచారం. ఇప్పటికే పూరీ అతడికి స్టోరీ వినిపించాడని, యశ్ కు కూడా ఈ స్టోరీ బాగా నచ్చిందని త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందని టాలీవుడ్లో టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో యశ్ ను పూరీ ఒక వైవిధ్యమైన పాత్రలో చూపించబోతున్నాడు. ఈ వార్త నిజమైతే పూరీ – యశ్ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఏర్పడుతుంది. హీరోలను ఒక రకమైన మాస్ స్టైల్ లో చూపించే డైరెక్టర్ పూరీ, యశ్ ను ఎలా చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్నీ అనుకునట్లు జరిగితే 2021 ఫిబ్రవరి నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దీనిపై పూరీ త్వరలోనే ఒక క్లారిటీ ఇస్తాడని తెలుస్తోంది.











