ఏపీలో వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఇక ఈ స్కామ్కు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా ఈ స్కామ్లో కీలకంగా ఉన్న రాజ్ కసిరెడ్డి..బ్లాక్మనీని వైట్లోకి మార్చేందుకు సినిమాలు తీసినట్లు గుర్తించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను నెలకొల్పి..నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా స్పై అనే పాన్ ఇండియా సినిమా నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2023 జూన్ 29న ఈ సినిమాను విడుదల చేశారు. దీనికి కథ కూడా రాజ్ కసిరెడ్డే సమకూర్చినట్లు టైటిల్స్లో వేసుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనకున్న రహస్యాన్ని స్పృశిస్తూ..ఓ గూఢచారి ఇతివృత్తంతో రూపొందించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. ఐతే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
ఈడీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు ఉప్పలపాటి చరణ్తేజ్ అనే ఓ డైరెక్టర్, రచయితను సీఈవోగా పెట్టుకున్నారు. ఒకేసారి భారీగా సినిమాలు నిర్మించడం కోసం పలువురు యువ డైరెక్టర్లు, రచయితలకూ అడ్వాన్సులిచ్చారు. ఆ మధ్యకాలంలో మిడ్ రేంజ్, కొత్త హీరోలతో హిట్ సినిమాలు తీసిన నలుగురైదుగురు డైరెక్టర్లతో కథలపై చర్చించి సినిమాల నిర్మాణానికి ప్రయత్నించారు. మద్యం కుంభకోణంలో సమకూరిన నగదును దీనిలోకి కుమ్మరించినట్లు సమాచారం. ఈ లోగానే ఎన్నికలు రావడం, ఏపీలో జగన్ ఓడిపోవడం, లిక్కర్ స్కామ్పై దర్యాప్తు తీవ్రతరం కావడంతో..ఆ కొత్త ప్రాజెక్టులన్నింటినీ నిలిపేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
స్పై సినిమాను ఎంత బడ్జెట్లో నిర్మించినట్లు చెప్పారు? దానికి వాస్తవంగా చేసిన వ్యయం ఎంత? ఈ సొత్తు ఎక్కడి నుంచి సమకూరింది? ఏయే రూపాల్లో చెల్లించారు? ఈ సినిమాకు జరిగిన వ్యాపారమెంత? తదితర వివరాలన్నీ ఇప్పటికే సిట్ సేకరించింది. కొంతమందికి నగదు రూపంలో చెల్లించినట్లు గుర్తించింది. ఇంకా ఏయే సినిమాలు నిర్మాణానికి పైప్లైన్లో పెట్టారు? వాటి కోసం ఎంత వెచ్చించినట్లు లెక్కలు చూపించారు?ఇందుకు మనీ రూటింగ్ ఎలా చేశారు? అనే దానిపై సిట్ దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. నగదు రూటింగ్ చేసే క్రమంలో భాగంగా ఏయే స్థాయిల్లో ఎవరెవరు ఏ పాత్ర పోషించారనే వివరాలు సిట్ తీసుకుంది.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు..2020 డిసెంబరు 12న ఈడీ ఎంటర్టైన్మెంట్ సంస్థను నెలకొల్పారు రాజ్ కసిరెడ్డి. ఆ వెంటనే స్పై అనే సినిమాను నిర్మించారు. దానికి నిర్మాతగా తన పేరు అధికారికంగానే వేసుకున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ మాట్లాడారు.
మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా సిట్ బృందాలు..ఇటీవల ఈడీ ఎంటర్టైన్మెంట్స్ రిజిస్టర్ చిరునామా అయిన హైదరాబాద్ మణికొండ ప్రశాంతి హిల్స్లోని ప్లాట్ నంబర్ 26, 27లో డోర్ నంబర్ 7-66/2/26, 27కు వెళ్లి తనిఖీలు జరిపాయి. అక్కడ ప్రస్తుతం ఈడీ ఎంటర్టైన్మెంట్స్కు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు కొనసాగట్లేదని గుర్తించాయి. ఇదే చిరునామాలో రీసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ అనే ఐటీ కంపెనీ ఉంది. దీనికి రాజ్ కసిరెడ్డి సతీమణి సోదరి పైరెడ్డి మేఘనా ప్రియదర్శినిరెడ్డి ఎండీగా, ఆమె తల్లి పైరెడ్డి సుజాతరెడ్డి డైరెక్టర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కంపెనీకి, ఈడీ ఎంటర్టైన్మెంట్స్కు మధ్య లావాదేవీలు ఏమైనా సాగాయా అన్నదానిపై కూడా సిట్ బృందాలు ఆరా తీస్తున్నాయి.