ప్రధాని మోదీ మీదుగా అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. దీంతో అమరావతి పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. అమరావతి ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ రాజీవ్ జైన్. ఇప్పటికే వివిధ కేంద్ర పథకాలు, మిషన్ల కింద అనేక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వం, ఆయా మంత్రిత్వ శాఖలతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే అర్బన్ ట్రాన్స్పోర్ట్ పథకాల కింద సుమారు 38 కిలోమీటర్ల మేర కొత్త రైలు నెట్వర్క్తోపాటు విజయవాడ, విశాఖపట్టణాల్లో ప్రతిపాదిత మెట్రో రైలు ప్రాజెక్టుల అమలుకు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.
ఇక ప్రధానమంత్రి ఎలక్ట్రికల్ బస్ సేవ స్కీమ్ కింద దాదాపు 750 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ఆంధ్రప్రదేశ్కు కేటాయించామని చెప్పారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటికే రూ. 5,701 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని వివరించారు. ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి కింద లబ్ధిదారులకు 103 శాతం రుణాలు పంపిణీ చేసి ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు. ప్రధానమంత్రి అవాజ్ యోజన (అర్బన్) పథకం కింద ఏపీలో ఇప్పటికే 3.5 లక్షల ఇళ్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అటల్ మిషన్ (అమృత్, అమృత్ 2.0) కింద ఏపీలో రూ. 6,200 కోట్ల కంటే ఎక్కువ ప్రతిపాదనలతో కూడిన 367 ప్రాజెక్టుల డీపీఆర్కు కేంద్ర ఆమోదం లభించిందని, ఇప్పటికే రూ. 589 కోట్ల నిధులు విడుదలయ్యాయని వివరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో అభివద్ధి పరుగులు పెడుతోంది. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పరిగెత్తిస్తున్నారు. లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నారు. మూడేళ్లలోనే అమరావతిలో కీలకమైన మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇక పోలవరం సైతం పూర్తి చేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.