ఏపీలోని అన్ని జిల్లాలకు సమాన దూరంలో… దాదాపు రాష్ట్ర భూభాగంలో మధ్య భాగాన రాష్ట్ర రాజధాని ఉండాలన్న భావనతో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంకల్పించిన అమరావతిపై ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోక తప్పదా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. నెలల తరబడి, ఏడాదికి పైగా అమరావతిని పరిరక్షించుకునేందుకు అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రాజధాని రైతులు ఉద్యమం సాగిస్తున్నా… లేశ మాత్రం కూడా కనికరం చూపకుండా సాగుతున్న జగన్… ఇప్పుడు ఆ ఉద్యమంలోకి వచ్చి దూకుతున్న ఓ వ్యక్తి కారణంగానైనా తన వైఖరిని మార్చుకోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మరి ఆ వ్యక్తి ఎవరన్న విషయానికి వస్తే… కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు చుక్కలు చూపిస్తున్న రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్. నూతన సాగు చట్టాలను రద్దు చేసేదాకా ఉద్యమాన్ని నిలిపేది లేదని తేల్చిచెప్పి మరీ… మోదీ సర్కారు వెన్నులో వణుకు పుట్టించిన తికాయత్… ఇప్పుడు అమరావతి ఉద్యమంలోకి దూకబోతున్నారు. ఈ మేరకు ఆదివారం విశాఖపట్టణం వచ్చిన సందర్భంగా తనను కలిసిన అమరావతి పరిరక్షణ సమితి నేతలకు తికాయత్ హామీ ఇచ్చారు. ఇంకేముంది… తికాయత్ అమరావతి ఉద్యమంలోకి దూకితే… మోదీ మాదిరే జగన్ సర్కారు కూడా దిగిరాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రైతుల ఉద్యమానికి అమరావతి పరిరక్షణ సమితి నేతల మద్దతు
అయినా అమరావతి ఉద్యమంలోకి రాకేశ్ తికాయత్ ఎలా వస్తున్నారన్న విషయంలోకి వస్తే… నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీని నలుదిశలా ముట్టడించిన రైతు ఉద్యమానికి తికాయత్ నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతన్నలు సాగిస్తున్న ఈ ఉద్యమానికి దేశం నలుమూలల నుంచి రైతు సంఘాలతో పాటు వివిధ ప్రజా సంఘాలు కూడా మద్దతు పలికాయి. ఈ క్రమంలో అమరావతి పరిరక్షణ సమితి నేతలు కూడా రైతుల ఉద్యమానికి మద్దతు పలికారు.ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితికి చెందిన కొందరు నేతలు నేరుగా ఢిల్లీ వెళ్లి మరీ రైతు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు. ఇందులో భాగంగా అమరావతి పరిరక్షణ ఉద్యమం పేరిట ప్రత్యేకంగా బ్యానర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగానే వారు తికాయత్ తోనూ భేటీ అయ్యారు. రైతుల ఉద్యమానికి మద్దతు తెలపడంతో పాటుగా తాము ఎదుర్కొంటున్న సమస్యను, తమను జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఎలా అణచివేస్తుందన్న విషయాన్ని తికాయత్కు వారు వివరించారు. ఈ విషయాన్ని సావదానంగా విన్న తికాయత్… తాను కూడా రాజధాని కోసం అమరావతికి భూములు ఇచ్చిన రైతులు సాగిస్తున్న అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మద్దతు పలుకుతానని, స్వయంగా తానే విజయవాడ వచ్చి మరీ ఉద్యమంలో పాలుపంచుకుంటానని కూడా తికాయత్ ఆ సందర్భంగా రాజధాని రైతులకు హామీ ఇచ్చారు.
తికాయత్ ఎంట్రీ పక్కానే..
తాజాగా రైతు ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికల్లో భాగంగా ఏపీకి వచ్చిన తికాయత్… ఆదివారం విశాఖలో సాగుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో, సోమవారం విజయవాడలో జరిగిన రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ఏడాదికి పైగా సాగుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమం విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. అంతేకాకుండా విజయవాడ వచ్చిన తికాయత్ను అమరావతి పరిరక్షణ సమితి నేతలు కలిశారు. తికాయత్తో భేటీ అయిన సందర్భంగా తమ ఉద్యమంలో పాలుపంచుకోవాల్సిన ఆవశ్యకతను రాజధాని రైతులు తికాయత్కు మరోమారు వివరించారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు తనను ఢిల్లీలో కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్న తికాయత్… రైతు ఉద్యమానికి మద్దతు పలికిన రాజధాని రైతులకు అండగా నిలుస్తామని మరోమారు తికాయత్ చెప్పారు. అంతేకాకుండా త్వరలోనే అమరావతి ఉద్యమంలో స్వయంగా పాలుపంచుకుంటానని, త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తానని తికాయత్ తెలిపారు. అంటే… అమరావతి ఉద్యమంలోకి తికాయత్ ఎంట్రీ అయితే పక్కానేనని తెలుస్తోంది. అయితే మోదీ సర్కారు మాదిరే జగన్ సర్కారు కూడా తికాయత్ దెబ్బకు దిగిరాక తప్పదన్న మాట. అంటే… అమరావతి ధ్వంసంపై జగన్ వైఖరి మారక తప్పదన్న మాట.