యాప్ల ద్వారా ఇన్స్టంట్ రుణాలు ఇచ్చి అధిక వడ్డీలతో జనాలను పీడిస్తున్న నిర్వాహకులపై ఆర్బీఐ సీరియస్ అయింది. ఆర్బీఐలో రిజిష్టర్ చేసుకుని, అనుమతి తీసుకున్న ఆర్థిక సంస్థలు మాత్రమే రుణాలు ఇవ్వాలని ఆర్బీఐ సూచించింది. ఇన్స్టంట్ రుణాల పేరుతో యాప్లు సృష్టించి అధిక వడ్డీలతో జనాలను పీడిస్తే ఊరుకునేది లేదని ఆర్బీఐ హెచ్చరించింది. చట్టాలకు వ్యతిరేకంగా యాప్లు తయారు చేసి అప్పులు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేసే యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
వారి ఆత్మలు ఆర్బీఐని కదిలించాయా?
ఏపీ, తెలంగాణ నుంచి ఆర్బీఐకి యాప్ రుణాలపై ఫిర్యాదులు వెళ్లడంతో చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల కాలంలో ఆన్ లైన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకుని సకాలంలో అధిక వడ్డీలు చెల్లించలేక తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇన్స్టంట్గా అప్పులు ఇవ్వడం, తరువాత వారిని అధిక వడ్డీల పేరుతో పీడించడంతో ఇప్పటికే ఐదుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ తరువాత మీడియాలో రచ్చ కావడంతో అనేక మంది బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు ఇస్తున్నారు. రుణాలిస్తున్న అనేక యాప్లు చైనా నుంచి ఆపరేట్ చేస్తున్నారని, స్థానికంగా వారు కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని రుణాలు ఇచ్చి, వసూళ్లకు వేధించేందుకు కొంత మందిని నియమిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
యాప్లను తొలగించలేరా?
రుణాలు ఇచ్చే అనేక యాప్లు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటున్నాయి. వాటని నియంత్రించే వ్యవస్థ లేకుండా పోయింది. ఐదుగురు చనిపోతేగానీ ఆర్బీఐ స్పందించలేదు. ఇంకా వేల సంఖ్యలో బాధితులు ఉండే అవకాశం ఉంది. ఇన్స్టంట్ రుణాలు ఇచ్చే యాప్లను గుర్తించి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసే విధంగా ఆ సంస్థలపై ఒత్తిడి తీసుకురావాలని బాధితులు సూచిస్తున్నారు