తొలి టెస్టులో చేదు జ్ఞాపకం.. రెండో టెస్టులో ఘన విజయం. మూడో టెస్టుకు దగ్గర పడుతున్న సమయం… వీటన్నింటి ప్రభావం భారత్, ఆసీస్ రెండు జట్లపై తీవ్రంగా ఉంది. జనవరి 7న సిడ్నీలో జరిగే.. మూడో టెస్టులో విజయం కోసం ఇరువురిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ క్రమంలో ఇరు జట్లలో మార్పు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. టీమిండియాలో భారత ఓపెనర్ రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట కెప్టెన్ విరాట్ కోహ్లీ పితృత్వ సెలవుపై వెళ్లాడు. దాంతో అజింక్య రహానేను తాత్కాలిక కెప్టెన్గా నియమించడం తెలిసిందే. తాజాగా భారత ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుతో చేరాడు. రోహిత్కు వైస్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించారు. చటేశ్వర్ పుజారా నుంచి టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఏదైనా పర్యటనకు వెళ్లిన జట్టులో కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దర్ని మార్చడం చాలా అరుదుగా జరుగుతుంది.
వైస్ కెప్టెన్సీపై భిన్న స్వరాలు..
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు వరకు రోహిత్ శర్మ జట్టులోనే లేడు. ఫిట్నెస్ సమస్యలు, క్వారంటైన్ కారణంగా వన్డేలు, టీ20లతో పాటు తొలి రెండు టెస్టులకు కూడా దూరంగా ఉన్న అతడు.. మూడో టెస్టు కోసం జట్టులోకి వచ్చాడు. నేరుగా మేనేజ్మెంట్ అతడికి వైస్ కెప్టెన్సీ అప్పగించేయడం చర్చనీయాంశమైంది. రెండో టెస్టులో తిరుగులేని విజయాన్ని సాధించి.. మంచి ఫామ్లో జట్టులో అంత హడావుడిగా మార్పులెందుకు చేయాలనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చరిత్రలో గుర్తుండిపోయే విజయం సాధించడంలో పుజారా పాత్ర సైతం ఉందని.. అటువంటిది వెంటనే ఆతడిని తప్పించడం ఏంటనే విషయంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
అ’ద్వితీయ’ విజయంలో వైస్ కెప్టెన్గా పుజారా..
తొలి టెస్టులో ఘోర పరాజయం, భారత్ క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు. అంతేగాక ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీ, టాస్ ఆసీస్ గెలవడం, ఆట మధ్యలోనే ఉమేశ్ యాదవ్ దూరమవ్వడం… ఇన్ని ప్రతికూలాంశాలతో రహానె సేన ఎలా పోరాడుతుందోనని అందరిలోనూ అనుమానాలు! కానీ భారత్ బెబ్బులిలా చెలరేగింది. అద్వితీయ పోరాటంతో కంగారూలను చిత్తుచేస్తూ స్ఫూర్తిదాయక విజయం సాధించింది. అయితే.. ఆ అద్వితీయ విజయంలో పుజారా పాత్ర సైతం ఉందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
టెస్టుల్లో రోహిత్తో పోలిస్తే..
కోహ్లీ తొలి టెస్టు తర్వాత జట్టుకు దూరమయ్యాక రహానె కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. పుజారా రెండో టెస్టుకు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. రోహిత్తో పోలిస్తే ఎక్కువ టెస్టులాడింది, టెస్టు జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నది పుజారానే. గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో ఓపెనర్ అవతారమెత్తి రాణించడానికి ముందు వరకు రోహిత్కు టెస్టు జట్టులో చోటే ప్రశ్నార్థకం. అలాంటి ఆటగాడు సిరీస్ మధ్యలో జట్టులోకి రాగానే.. పుజారాను తప్పించి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీసీసీఐ ఏమంటోందంటే..
టీమిండియాలో మార్పులపై బీసీసీఐ స్పందించింది. మూడో టెస్టులో వైస్ కెప్టెన్ మార్పుపై ఆసక్తికర సమాధానం చెప్పంది. రోహిత్ ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో వైస్ కెప్టెన్ కావడం.. చివరగా ఆడిన టెస్టు సిరీస్లో రాణించడం వల్ల అతనే వైస్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించినట్టు పేర్కొన్నారు. “రోహిత్ సుదీర్ఘ కాలంగా వన్డేలు, టీ20ల్లో జట్టు వైస్ కెప్టెన్. కాబట్టి విరాట్ లేనపుడు జట్టు నాయకత్వ బృందంలో అతనుండటం అనివార్యం” అని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు.
ఆసీస్ సొంత గడ్డపై తిరుగులేని విజయాన్ని సాధించిన టీమిండియాలో ఈ మార్పులు ఎటువంటి ఫలితాలను ఇస్తాయో.. చూడాలి. అదే ఫామ్ను భారత్ కొనసాగిస్తుందా… లేక ఆసీస్ రివేంజ్ తీర్చుకుంటుందా.. అనేది వేచి చూడాల్సిందే!