కరోనా మరో గాయకుడిని కబళించింది. ప్రముఖ సినీ గాయకుడు జి. ఆనంద్ (67) గురువారం రాత్రి కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకింది. చికిత్స కోసం ప్రయత్నించినా వెంటిలేటర్ లభించికపోవడంతో కన్నుమూశారు. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని తులగమ్ గ్రామం. దాదాపు 50 ఏళ్లుగా ఆయన సినిమా రంగంలో ఉన్నారు. ముఖ్యంగా ఒక తరం వారికి ఆనంద్ గొంతు సుపరిచితం.
అమెరికా అమ్మాయి చిత్రంలో ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక పాట ఎంతో పాపులర్. దిక్కులు చూడకు రామయ్య.., విఠలా విఠలా పాండురంగ విఠలా.. లాంటి ఎన్నో పాటలు ఆనంద్ గళం నుంచి వెలువడ్డాయి. ముఖ్యంగా పాటకచేరీలలో ఆనంద్ ఎక్కువగా పాటలు పాడేవారు. అనేక నగరాల్లో ఆనంద్ కచేరీలు జరిగేవి. దాదాపు 6500 కచేరీలను ఆయన నిర్వహించారు.
తను స్థాపించిన స్వరమాధురి సంస్థ ద్వారా ఈ కచేరీలు నిర్వహించేవారు. కొన్ని చిత్రాలకు ఆయన సంగీతం కూడా సమకూర్చారు. చాలా సీరియల్స్ కు కూడా ఆయన సంగీతం సమకూర్చారు. ఆయన స్థాపించిన సంస్థ ద్వారా ఎంతో మంది గాయకులుగా సినిమా రంగానికి పరిచయమయ్యారు. కరోనా కాటుకు గానగంధర్వుడు బాలు బలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో ఆనంద్ కూడా చేరారు.
అంత్యక్రియలు పూర్తి
ఆనంద్ అంత్యక్రియలు ఉదయం ఏడున్నర గంటలకు వనస్థలిపురం దగ్గరలో సాహెబ్ నగర్ స్మశాన వాటికలో నిర్వహించారు. బావమరిది, మేనకోడలు మాత్రమే పాల్గొన్నారు. కరోనా కావడంతో ఎవ్వరినీ పిలవలేదు. ఇంటికి తీసుకు రానివ్వలేదు. ఒక మంచి గాయకుడి మహాభినిష్క్రమణం ఇలా జరగడం దురదృష్టకరం.











