చైనాలో ప్రబలిన కొవిడ్-19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది కొవిడ్ బారిన పడ్డారు. ప్రపంచంలో లాక్ డౌన్లు, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం కారణంగా లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది.ప్రపంచం ఇంకా కొవిడ్ నుంచి బయటపడకపోగా భారత్ను కొవిడ్-19 సెకండ్ వేవ్ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.అయితే తాజాగా చైనా వల్ల ప్రపంచానికి మరో ముప్పు వచ్చిపడిందన్న చర్చ నడుస్తోంది. అంతరిక్షంలో ఆధిపత్యం కోసం సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే చర్యల్లో భాగంగా చైనా ప్రయోగించిన రాకెట్ అదుపు తప్పింది.నియంత్రణ కోల్పోయి భూమి వైపు దూసుకువస్తుండడమే ఈ ఆందోళనకు కారణం. అంతేకాదు..భారత్లో కరోనా వల్ల మరణించిన వారికి అంత్యక్రియలు చేస్తున్నఫొటోను, చైనా అంతరిక్ష కేంద్రంలోకి పంపిస్తున్ననౌక ఫొటోని జతచేసి భారత్లో వెలిగించిన మంటలు vs చైనా వెలిగించిన మంటలు అనే పోస్టు కూడా చేసింది.ఇప్పుడు అదే నౌక అదుపు తప్పి..మరోసారి ప్రపంచాన్ని టెన్షన్కి గురి చేస్తోంది.
ఏప్రిల్ 29న ప్రయోగం
చైనా ఏప్రిల్ 29న 21 టన్నుల బరువు ఉన్నLong March 5b రాకెట్ను ప్రయోగించింది. కోర్ మాడ్యూల్ను అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్లాక నియంత్రణ కోల్పోయింది. ప్రస్తుతం ఈ రాకెట్ చైనా అదుపులో లేదు. భూమి వైపు దూసుకొస్తోంది.నియంత్రణ లేకపోవడంతో రాకెట్ గమనాన్నినిర్దేశించే అవకాశం లేదు. మే8న భూమికి అతి సమీపంలోకి రానుంది. అయితే సముద్ర జలాల్లో పడుతుందా లేక జనావాసాల్లో పడుతుందా అనే సందేహాలే ఈ ఆందోళనకు కారణమయ్యాయి.సాధారణంగా అంతరిక్షంలోకి పంపిన రాకెట్లు,నౌకలు గతితప్పితే..సముద్రంలో పడేందుకు ప్రీఫిక్స్ ప్రోగ్రామింగ్ ఉంటుంది.అయితే చైనా ఈ జాగ్రత్త తీసుకుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు భూవాతావరణంలోకి రాగానే ఆ వేడికి రాకెట్ మండిపోతుందని,శకలాలు మాత్రమే పడతాయని, పెద్దగా ప్రమాదం ఉండదనే వాదన కూడా ఉంది.
గత ఏడాది కూడా..
కాగా గత ఏడాది కూడా చైనాకు చెందిన రాకెట్ కూలింది.తొలిసారి లాంగ్మార్చ్5బిని ప్రయోగించినప్పుడు దాని శకలాలు భూమిపై పడ్డాయి.ఐవరీ కోస్ట్లోని జనవాసాల్లో పడడంతో పలు గ్రామాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. 1979లో ఆస్ట్రేలియా సముద్ర జలాల్లో కూలిన స్కైలాబ్ తర్వాత భూమిపై కూలిన అతి పెద్ద రాకెట్గా ఇది నిలిచింది. 1979లో ఆస్ట్రేలియాలోని ఎస్పెరాన్స్ సముద్ర జలాల్లో స్కైలాబ్ కూలిపోయిన విషయం తెలిసిందే.
గంటకు 23వేల కిలోమీటర్ల స్పీడుతో..
కాగా ఈ రాకెట్ పొడవు 100 అడుగులు కాగా 16 అడుగుల వెడల్పు ఉంటుంది. 21-22 టన్నుల బరువు ఉన్న రాకెట్ ప్రస్తుతం గంటకు 23వేల కిలోమీటర్ల వేగంగా భూమి వైపు దూసుకొస్తోందని అమెరికా స్పేస్ కమాండ్ ట్రాక్ అంచనా వేస్తోంది. శనివారం నాటికి భూమిని చేరుతుందని, అయితే శకలాలుగా పడతాయా లేక సముద్రంలో కూలుతుందా అనేది చెప్పలేమని తేల్చింది. అయితే తాము విశ్లేషిస్తున్న ప్రకారం న్యూయార్క్, కాలిఫోర్నియా, యూరప్లోని మాడ్రిడ్, ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ సమీప ప్రాంతాల్లో (అంటే 850 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా) పడొచ్చని చెబుతున్నారు.
ఆధిపత్యం కోసం..
కాగా అన్ని రంగాల్లో విశ్వంపై ఆధిపత్యం కోసం తహతహలాడుతున్న చైనా అంతరిక్షంలోనూ అధిపత్యం కోసం సొంత స్పేస్ స్టేషన్ను నిర్మించుకుంటోంది. 2030 నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) అమెరికాకు చెందిన నాసా, రష్యాకి చెందిన రోస్ కోస్మోస్, యూరోపియన్ స్పేస్ ఏజన్సీ ఈఎస్ఏని మించి సూపర్ పవర్గా ఎదగాలన్న ఉద్దేశంతో సొంత స్పేస్ స్టేషన్ టియన్గాంగ్ ఏర్పాటుకు 2011లో శ్రీకారం చుట్టింది.ఇది పూర్తయితే వేరే దేశాలతో సంబంధం లేకుండా అంతరిక్ష వ్యోమగాములు(ఆస్ట్రోనాట్స్) ల్యాండింగ్ అండ్ స్పేస్ క్రాఫ్ట్డాకింగ్(వ్యోమ నౌకలు చేరే చోటు) ఏర్పాటవుతుంది. అక్కడే ప్రయోగాలు కూడా చేసే వీలుంటుంది.ఇందుకోసం చైనా 11 రాకెట్లను ప్రత్యేకంగా లాంచ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 100 టన్నుల బరువు ఉన్న రాకెట్లు అవసరం అవుతాయి. అయితే ఈ ప్రయోగాలను వేగంగా చేస్తున్న చైనా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అవహేళన చేసిన మాడ్యూల్ ఇదే..
మూడురోజుల క్రితం చైనా ప్రభుత్వంలో అంతర్భాగమైన కమ్యూనిస్టు పార్టీకి చెందిన సెంట్రల్ పొలిటికల్ అండ్ లీగల్ అఫైర్స్ కమిషన్ వీబోలో సంచలన పోస్టు పెట్టింది.భారత్ కరోనా కారణంగా చితి మంటల్లో ఉంటే..తాము టియాన్హీ మాడ్యూల్ ప్రయోగాన్ని చేస్తున్నామని పోస్టు చేసింది. చైనా వెలిగించిన మంటలు వర్సెస్ భారత్ వెలిగించిన మంటలు అని కామెంట్ చేస్తూ రెండు ఫొటోలతో విబోలో పోస్టు చేసింది.అయితే ఈ పోస్టుపై చైనాలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొవిడ్ సమయంలో ఇతర దేశాలను ఇంతలా కించపర్చాల్సిన అవసరం లేదని కామెంట్లూ వచ్చాయి.నిరంతరం భారత్పై అక్రోశం వెళ్లగక్కే గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ కూడా ఈ పోస్టుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో నైతిక విలువలు పతనం కాకూడదని గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హూషిజిన్ కామెంట్ చేశారు. అంతర్జాతీయంగా కూడా పలు విమర్శలు వచ్చాయి.దీంతో గంటల వ్యవధిలోనే దాన్ని తొలగించింది.తాజాగా ఇప్పుడు అదే నౌక గతి తప్పింది.











