తెలుగు సినిమాకు వెలుగు కిరణాలు చాలానే ఉన్నాయి. అలాంటి కిరణాల్లో ఒకటి డీవీఎస్ రాజు. ఆయన పూర్తి పేరు దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు. డీవీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారాయన.
డీవీఎస్ ప్రొడక్షన్స్ స్థాపించి ఎన్టీఆర్ హీరోగా ‘మంగమ్మ శపథం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా పెద్ద హిట్. దాంతో వరుసగా ఎన్టీఆర్ తో సినిమాలు నిర్మించారు. ఆ వరుసలో పిడుగురాముడు, తిక్కశంకరయ్య, దనమా దైవమా చిత్రాలు నిర్మించారు. కె. విశ్వనాథ్ దర్వకత్వంలో శోభన్ బాబు హీరోగా జీవనజ్యోతి నిర్మించారు. ముజే ఇన్సాఫ్ చాహియే అనే హిందీ చిత్రం కూడా ఆయన నిర్మించిన వాటిలో ఉంది. నిర్మాతగా దాదాపు 25 చిత్రాలు తీశారు. ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
సినిమా రంగంలో రారాజు
ఒక తరంలో ఆయన సినిమా రంగం రారాజు అనే చెప్పాలి. అసలు డీవీఎస్ రాజు ఎక్కడి వారు, ఏమిటన్న వివరాలు చూద్దాం. ఆయన తండ్రి బలరామ రాజు పార్లమెంటు సభ్యుడిగానూ పనిచేశారు. వీరి సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలోని అల్లవరం. డిసెంబరు 13, 1928న డీవీఎస్ రాజు జన్మించారు. నవంబరు 13, 2010లో ఆయన కన్నుమూశారు. మెడిసిన్ చదువుదామని చెన్నై వెళ్లిన ఆయన దృష్టి సినిమాల వైపు మళ్లింది. రూ.10 లక్షల పెట్టుబడితో1948లో సినీ లిథో వర్క్ను ప్రారంభించారు. తెలుగు సినిమాల వాల్ పోస్టర్లు, ప్రచార పత్రాల ముద్రణ ఈ సంస్థ పని. క్వాలిటీ విషయంలో రాజీపడేవారు కాదు. అలా సినీ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి.
మహానటుడు ఎన్టీఆర్ కు సంబంధించిన ఎన్ఏటీ సంస్థ నిర్మించిన పిచ్చిపుల్లయ్య సినిమా ప్రచార, ప్రకటన పత్రాలు ముద్రణ బాధ్యతలను సినీ లిథో సంస్థే చేపట్టింది. ఎన్ఏటీ సంస్థతో ఏర్పడిన ఆ బంధం అందులో భాగస్వామిని కూడా చేసింది. వీరి భాగస్వామ్యంలో తోడుదొంగలు, గులేబకావళి కథ సినిమాలొచ్చాయి. అలా మొదలైన డీవీఎస్ రాజు ప్రయాణం ప్రగతి ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించేదాకా వెళ్లింది. ఆ బ్యానర్ మీద ‘మా బాబు’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఇందులో హీరోహీరోయిన్లుగా ఏయన్నార్, సావిత్రి నటించారు. ఆ తర్వాత ఎలాంటి సినిమాలు తీశారో తెలిసిందే.
డీవీఎస్ రాజును అందరూ తెలుగు సినిమా రంగ భీష్ముడు అని పిలిచే వారు. సినిమా అనేది జానపదమైనా, సాంఘికమైనా, పౌరాణికమైనా కథ బలంగా ఉండాల్సిందే అని నమ్మిన నిర్మాత ఆయన. సినిమాలో ఆయన ఇన్వాల్వ్ మెంట్ అలా ఉండేది. సినిమా రంగంలో ఆయనకున్న అనుభవం చిత్ర పరిశ్రమకు సేవ చేసేందుకు ఉపయోగపడింది. దక్షిణ భారత సినీ వాణిజ్యమండలికి అధ్యక్షుడిగానూ పని చేశారు. ఆ కాలంలోనే కొత్తవారిని ప్రోత్సహించేందుకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించారు.
దీని ద్వారానే రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్ లాంటి అగ్ర హీరోలు చిత్ర పరిశ్రమకు వచ్చారు. చిరంజీవిని ఆ శిక్షణాలయంలో చేర్పించడంలో రాజు మాట సాయం చేశారు. అంతేకాదు కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన జీవిన జ్యోతి చిత్రం ఉత్తమ చిత్రం పురస్కారాన్ని కూడా అందుకుంది. మహానటుడు ఎన్టీఆర్ కుటుంబంతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. అందుకే ఎన్టీఆర్ కూడా ఆయనపై నమ్మకం ఉంచి సినిమా రంగ బాధ్యతలు కూడా అప్పగించారు.
కీలక పదవుల్లో సినీ భీష్ముడు
డీవీఎస్ రాజుగారు రెండుసార్లు నేషనల్ ఫిల్మ్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులిగా పని చేశారు. రిచర్డ్ ఆటెన్బరో రూపొందించిన ‘గాంధీ’ చిత్రానికి సంబంధించి మన దేశంలో ఎదురైన ఇబ్బందుల్ని తొలగించడంలో ఎంతో చొరవ చూపారు. ఫలితంగానే ఆ చిత్రం ద్వారా వచ్చిన లాభాల్లో అయిదు శాతం ‘సినీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’కి దక్కాయి. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 1984-89లో ఎఫ్డీసీ అధ్యక్షులిగా పని చేశారు. ఆయన హయాంలోనే హైదరాబాద్లో లలిత కళాతోరణం నిర్మించారు.
అలాగే అంతర్జాతీయ చిత్రోత్సవాన్నీ ఇక్కడ ఘనంగా నిర్వహించారు. తిరిగి 2002-04 మధ్య కాలంలో ఆ సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. సినిమా రంగానికి ఆయన అందించిన సేవలకు 1989లో ఏపీ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆయనను సత్కరించింది.1995లో చెన్నైలో దక్షిణభారత చలనచిత్ర వాణిజ్యమండలి ఆయనను ‘సినీ భీష్మ’ అనే బిరుదుతో సత్కరించింది. ఒక నాగిరెడ్డి, ఒక డి. రామానాయుడు, ఒక డీవీఎస్ రాజు.. ఇళా ఎందరో నిర్మాతల పునాదుల మీదనే తెలుగు సినిమా అనే అందమైన సౌధం నిర్మితమైంది. అలాంటి డీవీఎస్ రాజు గారికి మా లియో ఛానెల్ నివాళి ఇది.











