ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయడమే కనికట్టు. వైద్యం అందించాల్సిన డాక్టర్లు కనికట్టు చేస్తూ ఒకరికి పుట్టిన పిల్లల్ని వేరొకరికి పుట్టినట్లుగా పత్రాలు ‘ సృష్టి’ స్తూ లక్షలు అర్పిస్తున్న వ్యవహారం విశాఖలో వెలుగుచూసింది. అవాంఛిత గర్భం, ఎదుటివారి ఆర్థిక అవసరాలు పెట్టుబడిగా చేసుకుని కోట్లకు పడగలెత్తిన ముఠా గుట్టు రట్టు చేశారు విశాఖ పోలీసులు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద మహిళల వీరి తొలి టార్గెట్. ఐవిఎఫ్ విధానం ద్వారా గర్భధారణకు ఒప్పిస్తారు. పుట్టబోయే పిల్లల ను ఒప్పందం చేసుకున్న వారే తల్లిదండ్రులుగా పత్రాలు సృష్టిస్తారు. సృష్టి కేంద్రంలో ఇప్పటివరకు 56 ప్రసవాలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. మరింత లోతైన విచారణ తర్వాత ఈ సంఖ్య ఎంతకు చేరుకుంటుందో అంచనాకు కూడా చిక్కడం లేదు. Universal Srushti & Research Centre. తో మొదలైన ఈ వ్యవహారంలో మరికొన్ని ఆసుపత్రులు ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. పద్మజ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ పద్మజా, సృష్టి ఆసుపత్రి ఎండి నమ్రత ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు.
వ్యవహారం ఎలా నడుపుతారు అంటే….?
మారుమూల పల్లెల్లో వీరు ఆశా వర్కర్ లను, ఏఎన్ఎం లను ఇన్ఫార్మర్లుగా నియమించుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు, అక్రమంగా గర్భం దాల్చిన వారిని గుర్తించడం వీరి ప్రథమ కర్తవ్యం. వారితో మాటామంతీ కలిపి మచ్చిక చేసుకుంటారు. తరువాత ఆసుపత్రికి వీరికి మధ్య వ్యవహారం నడిపేందుకు మరికొందరు ఏజెంట్లు తెరపైకి వస్తారు. రక రకాల ఆఫర్లు గర్భవతుల ముందు ఉంచుతారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చేందుకు అంగీకరిస్తే కొంత మొత్తం, అక్రమంగా వచ్చిన గర్భం వదులుకుంటే మరికొంత మొత్తం ఇలా రకరకాల ఆఫర్లు వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రతిపాదనలు చేస్తారు. అధికంగా వీరికి దక్కేది మాత్రం రూ. లక్ష నుంచి లక్షన్నర. అప్పటికే గర్భం దాల్చిన మహిళలు, పుట్టబోయే బిడ్డ ఆడ లేదా మగ అక్రమంగా తెలుసుకుని, ఆడపిల్ల వద్దు అని అనుకునేవారికి ఉచితంగా డెలివరీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంటారు. మరోవైపు శిశువును కొనుగోలు చేసుకునే దంపతుల వివరాలను ముందుగానే సేకరించి ఉంచుకుంటారు. ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని అనుసరించి రూపాయలు 10 లక్షల నుంచి పదిహేను లక్షల వరకూ ఒక్కో శిశువును విక్రయిస్తున్నారు. ఈ ముఠా సాగిస్తున్న మరో తరహా గుట్టును పద్మజా ఆసుపత్రి వ్యవహారంలో వెలుగు చూసింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ మహిళలకు ఉచితంగా సిజేరియన్ చేస్తారని ఆశ చూపించి, శిశువు పుట్టాక చనిపోయిందని నమ్మించి, ఆ బిడ్డను వేరొకరికి విక్రయించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంత పక్కాగా నిర్వహిస్తూ ఉన్నారంటే, కొనుగోలు చేసుకునే వారే పుట్టబోయే శిశువు తల్లిదండ్రులుగా జీవీఎంసీ నుంచి బర్త్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు.
ఈ మొత్తం రాకెట్ లో జీవీఎంసీ సిబ్బంది పాత్ర ఏంటి? దళారుల పాత్ర ఎంత? గ్రామీణ ప్రాంతాల్లో బాధితులను గుర్తిస్తున్న వారి పాత్ర ఏంటి? ఇంకా ఎవరి పాత్ర ఈ వ్యవహారాల్లో ఇమిడి ఉంది ? అనే విషయాలు విచారణలో వెలుగు చూడాల్సి ఉంది. విశాఖలో ఒకరి సంతానాన్ని మరొకరి సంతానంగా ‘ సృష్టి’ స్తున్న విక్రయాలు సుమారు పదేళ్లు గా సాగుతోంది. ఈ లెక్కన ఎన్ని వందల మందిని విక్రయించి ఎన్ని కోట్లు ఆర్జించారు అన్న లెక్కలు తేవాల్సి ఉంది.