ఉచిత విద్యుత్తు పొందుతున్న వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు బిగించడం అనే నిర్ణయం తీసుకున్నప్పటికీ.. విపక్ష తెలుగుదేశం ఆశిస్తున్నంత ప్రజా వ్యతిరేకత రాకుండా.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ బాగానే మేనేజ్ చేయగలిగింది.
ప్రస్తుతం ఉచిత విద్యుత్తు పొందుతున్న ఏ ఒక్క రైతుకు కూడా నష్టం జరగదని చెప్పడం ద్వారా వాళ్లు ప్రజావ్యతిరేకత పుట్టకుండా చేయగలిగారు. పైగా కేంద్రం ఆచరణలోకి తెస్తున్న విద్యుత్తు సంస్కరణల్లో భాగంగా మాత్రమే ఇలాంటి నిర్ణయం జరుగుతున్నదని కూడా చెప్పగలిగారు. కానీ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు బిగించడం-నిర్వహణ, ఆ పనిని ప్రెవేటు సంస్థలకు అప్పగించడం- అనే ఒక్క వ్యవహారంలోనే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల దందా (అయిదేళ్లలో) దాగి ఉన్నదంటే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఇస్తున్నది ఉచిత విద్యుత్తే కాగా, బిల్లింగ్ అయ్యే సొమ్మును నేరుగా రైతుల ఖాతాల్లోకే ప్రభుత్వం ప్రతినెలా జమ చేస్తుందని, అలా జరగాలంటే.. బిల్లింగ్ జరగాలి కాబట్టి.. మీటర్లు పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంపై కొన్ని రకాల భయాలున్నప్పటికీ.. ప్రభుత్వం రైతులకు ధైర్యం చెప్పి, ముందుకు సాగుతోంది.
మీటర్లు ఎందుకు పెట్టలేదంటే..
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లంటే.. పొలాల్లో ఎక్కడెక్కడో ఉంటాయి. వాటన్నింటికీ మీటర్లు ఏర్పాటు చేయడం పెద్ద పని. నిర్వహణ ఇంకో పెద్ద పని. అసలే ఇస్తున్నది ఉచిత విద్యుత్తు.. దానికోసం ఇదంతా అదనపు ఖర్చు అవుతుంది. వ్యవసాయ కనెక్షన్ల వల్ల రాబడి ఉండకపోగా, మీటర్ల వ్యవహారం భారం అవుతుంది. అందుకే ప్రతి కనెక్షనుకు మీటర్లు పెట్టలేదు. ట్రాన్స్ ఫార్మర్లు, ఫీడర్ల వద్ద మీటర్లు పెట్టి.. వాటికింద వినియోగం అయ్యే విద్యుత్తు రీడింగ్ ప్రకారం సగటులు లెక్కకట్టి.. డిస్కమ్ లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తు తాలూకు బిల్లులను చెల్లిస్తోంది.
మీటర్లు ప్రెవేటు చేతికి..
ఇప్పుడు మీటర్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత.. వీటిని ప్రెవేటు సంస్థల ద్వారా ఏర్పాటు చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంటే.. పొలాల్లో మీటర్లను పెట్టడం, వాటి నిర్వహణ, ప్రతి నెలా వాటినుంచి రీడింగ్ తీసుకుని విద్యుత్తు సంస్థలకు తెలియజెప్పడం ఈ పని మొత్తం ప్రెవేటు సంస్థ చూసుకుంటుందన్నమాట.
రాష్ట్రవ్యాప్తంగా 17.54 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లున్నాయి. డిస్కమ్ సిబ్బంది ద్వారా మీటర్లు బిగించడానికి పూనుకుంటే కొంత ఆలస్యం కావొచ్చు గానీ పని పూర్తవుతుంది. అయితే ఈ ఏర్పాటు బాధ్యత ప్రెవేటు వాళ్లకు అప్పగించే ఆలోచన కనిపిస్తోంది. మీటరు కొనడంతో పాటు, దాన్ని ఏర్పాటుచేసి నిర్వహించడం వారిదే బాధ్యత. అయిదు జిల్లాల్లో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడానికి టెండర్లు కూడా పిలిచారు. ఈ దిశగా ఇప్పటికే ఒక అడుగు పడినట్టు లెక్క. అయితే ఇలాంటి ఏర్పాటు ద్వారా.. ప్రభుత్వానికి మరింత భారం పెరగడమే తప్ప తగ్గేది ఉండదు.
ఒక్కో మీటరు ఏర్పాటుకు ఎంత ఖర్చు? నిర్వహణకు ఎంత ఖర్చు? అనే అంచనాలతో ప్రభుత్వం మీద ఎంత భారం పడవచ్చో లెక్కలు వార్తల్లో వస్తున్నాయి. మీటర్ల ఏర్పాటుకే దాదాపు 1200 కోట్లు ఖర్చయ్యే పరిస్థితి ఉండగా, నిర్వహణకు అయిదేళ్లలో రెండువేల దాకా ఖర్చు కావచ్చునని.. ప్రెవేటు వారికి ఇవ్వకుండా డిస్కమ్ స్వయంగా నిర్వహిస్తే కనీసం వెయ్యి కోట్లు ఆదా అవుతాయని కూడా అంచనాలు సాగుతున్నాయి. ఇదంతా ఒక పార్శ్వం మాత్రమే.
ఏమిటి నష్టం..
మీటర్ రీడింగ్ వరకు ప్రెవేటు సంస్థల సేవలు, అవుట్ సోర్సింగ్ సేవలు వాడుకోవడం ఓకే. కానీ.. మీటర్ల ఏర్పాటు కూడా ప్రెవేటు వారికే ఇస్తే, వారి ఖర్చుతోనే జరగాలని అనంటే గనుక.. వారి చేతుల్లోకి డిస్కమ్ వెళ్లిపోతున్నట్టే. ఎంతకాలం వారితో ఒప్పందం కొనసాగాలి? అనేది ఇదమిత్థంగా తేల్చి చెప్పడం కుదర్దు. ఒప్పందం కేన్సిల్ అయితే.. వారు బిగించిన మీటర్లు వారు పట్టుకుపోతారు. పైగా మీటర్లు డిస్కమ్ స్వయంగా ఏర్పాటు చేసుకుంటే ఖర్చు తగ్గే అవకాశం బాగా ఉంటుంది. ఒప్పందాన్ని ఎఫ్పుడు కావాలిస్తే అప్పుడు రద్దు చేసుకునేలా ఉంటుంది.
అలాగే నిర్వహణ, రీడింగ్ నమోదు పనులకే ఏడాదికి 400 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా కాగా.. డిస్కమ్ స్వయంగా, అదనంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకుని చేసినా సరే.. సగం ఖర్చుకే పూర్తయ్యే చాన్సుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయిన వారికి దోచిపెట్టడానికే ఇలా భారీ వ్యయంతో ప్రెవేటు సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఎప్పటిలాగే విపక్షాలనుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
రైతు ఆందోళనల నేపథ్యమే కారణమా?
వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగిస్తే వాటిని పగలగొడ్తాం అని వామపక్షాలు హెచ్చరిస్తున్నాయి. ఆందోళనలకు, పోరాటాలకు సిద్ధం అవుతున్నాయి. ఈ పోరాటాలకు రైతులనుంచి కూడా మద్దతు ఉంటోంది. మీటర్లు పెట్టడం, రైతులు వాటిని పగల గొట్టడం జరుగుతూ ఉంటే.. ఆ చికాకులను తట్టుకోవడం ప్రభుత్వానికి చాలా పెద్ద పని అవుతుంది. పైగా వామపక్షాల పోరాటాలు ఏదో ఒక సీజన్లో మీటర్ల మీదకు దండెత్తితే పోలీసుల్తో అడ్డుకోవచ్చు. కానీ రైతుల్లో కూడా వ్యతిరేకత వచ్చి.. వారే మీటర్లను ధ్వంసం చేయదలచుకుంటే.. ఎవరు అడ్డుకుంటారు? ఎలా అడ్డుకుంటారు? ఎన్ని సార్లు మీటర్లు మారుస్తారు? ఎంతమందిమీద కేసులు పెడతారు? ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఇలాంటి భయాల నేపథ్యంలోనే.. మీటర్ల తలనొప్పిని ప్రెవేటు సంస్థల నెత్తిన రుద్దాలని ప్రభుత్వం భావిస్తోందా? అనే చర్చలు కూడా సాగుతున్నాయి.
ఇంకో ప్రమాదం పొంచి ఉంది..
జగన్ సర్కారు.. విద్యుత్తు బిల్లుల మొత్తాన్ని కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి వేసేస్తుంది. ఆ నిర్ణయం జరిగిపోయింది. ఆ డబ్బు పొందే రైతులు తామే స్వయంగా బిల్లులు చెల్లించుకోవాలి. ఇదీ ప్రభుత్వం ప్రకటించిన ఏర్పాటు. అయితే బిల్లు సొమ్ము ప్రభుత్వం నుంచి తమ ఖాతాలోకి వచ్చిన తర్వాత.. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా.. ఇతరత్రా అత్యవసరాలకు ఆ సొమ్ము వాడేసుకుని.. రైతులు బిల్లు కట్టలేకపోతే ఏం జరుగుతుంది? వారి కనెక్షన్లను తొలగిస్తే సేద్యం సాగేదెలాగ? అలాంటప్పుడు వారి మీద కేసులు పెడితారా? వారు రోడ్డెక్కితే ఏం చేయగలరు? ఇవన్నీ ప్రశ్నలే.
ఒకవేళ వసూలు బాధ్యతను కూడా ఈ కాంట్రాక్టు ప్రెవేటు సంస్థలకే ఇస్తే గనుక ఇంకో సమస్య ఉంది. ప్రభుత్వం సొమ్ము ఇచ్చిన తర్వాత.. రైతు చెల్లించకపోతే గనుక.. ఆ ప్రెవేటు సంస్థల వసూలుదార్లు దాష్టీకానికి పాల్పడే ప్రమాదం ఉంది. వారి రౌడీయిజం, గూండాయిజం, ఆగడాల వార్తలే పత్రికల నిండా కనిపిస్తుంటాయి. టోల్ ప్లాజాల వద్ద వసూళ్లకు ఉండేవారు అడపాదడపా రౌడీయిజానికి దిగుతున్న తరహాలోనే రాష్ట్రమంతా పరిస్థితి ఉంటుంది.
ప్రభుత్వం నూరు శాతం రైతులకు అకౌంట్లలో కరెంటు బిల్లు డబ్బులు వేసేస్తే, నూరుశాతం మంది రైతులు గడువు తేదీ నాటికి ఖచ్చితంగా బిల్లు చెల్లించేస్తారని అనుకోవడం భ్రమ. ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటూ ఉంటాయి. వసూళ్లలో కూడా ప్రెవేటు పాత్ర ఉంటే గనుక.. దాష్టీకాలు తప్పవు. అలాంటప్పుడు.. ఆ గొడవలతో ప్రభుత్వానికి సంబంధం లేదు అని చెప్పుకోడానికే, తప్పించుకోడానికే ఇలా ప్రెవేటు బాట తొక్కుతున్నారా? అనే అభిప్రాయం కూడా ఏర్పడుతోంది.
ఏం చేస్తే మంచిది?
ప్రెవేటు సంస్థ కబంధహస్తాల్లో డిస్కమ్లు ఇరుక్కోకుండా ఉండాలంటే.. మీటరు ఏర్పాటు అనే వ్యవహారం.పూర్తిగా డిస్కమ్ ల ఆధ్వర్యంలోనే జరగాలి. దీనివల్ల మీటరు మీద ఓనర్షిప్ హక్కులు డిస్కమ్ చేతిలోనే ఉంటుంది. ప్రెవేటు సంస్థ చెప్పినట్టు వింటుంది. నిబంధనలు ఎప్పుడు అతిక్రమించినా వారిని తప్పించవచ్చు. మీటర్లకు వచ్చే ఇబ్బంది ఉండదు.
అలాగే వసూళ్ల విషయంలో మరో జాగ్రత్త తీసుకోవాలి. గ్రామగ్రామానికీ వాలంటీర్ల వ్యవస్థ వేళ్లూనుకుని ఉంది. మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా ప్రభుత్వం చేరువ కావడంలో ఈ వ్యవస్థ పాత్ర కీలకం. ఈ వ్యవస్థను వసూళ్లలో భాగస్వాముల్ని చేయచ్చు. రైతు ఖాతాలకు సొమ్ము చేరిన వెంటనే.. వాలంటీర్ల ద్వారా గానీ, ఇతర వ్యవస్థ ద్వారా గానీ.. రైతుల ఇళ్లవద్దకే వెళ్లి వసూలు చేసే ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఎగవేతలు చాలా వరకు తగ్గుతాయి.
మీటరింగ్ ఏర్పాటు చేయడం సంస్కరణల్లో భాగం అని ప్రభుత్వం చెబుతోంది. అలాంటి దాన్ని ఏకపక్షంగా ఎందరు వ్యతిరేకించినా ఫలితం దక్కుతుందో లేదో తెలీదు. కానీ.. వాటిని నిర్వహణ, ఈ ఆలోచన అమలు రూపేణా ఎలాంటి కొత్త ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అసాధ్యం కాదు.
.. సురేష్ పిళ్లె










