తిరుమల తిరుపతి దేవస్థానాలకు కార్యనిర్వహణాధికారిగా గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న కాలం నుంచి పదవిలో ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను రాష్ట్రప్రభుత్వం హఠాత్తుగా బదిలీచేసింది. వైద్య ఆరోగ్య ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించారు. నిజానికి బదిలీ అనేది పెద్ద విషయం కాదు. ఒక పదవిలోకి అధికారి వచ్చిన తర్వాత.. ఏదో ఒకనాటికి బదిలీ తప్పదు. కానీ.. సింఘాల్ ను బదిలీచేసిన సమయం, తీరు కొన్ని అనుమానాలకు తావిచ్చేలా ఉంది.
తిరుమలలో శ్రీవారికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అధికమాసం కారణంగా అలా రెండుసార్ల బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. వీటికి సంబంధించి ఏర్పాట్లు మొత్తం పూర్తయిన తర్వాత.. ఒక బ్రహ్మోత్సవాలు ముగిసి, మరికొన్ని రోజుల్లో రెండో బ్రహ్మోత్సవాలు జరుగుతాయనగా.. ఈవోను హఠాత్తుగా మార్చేయడం చర్చకు దారితీసింది. ఇటీవలి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకించి గరుడసేవ రోజున పరిణామాలకు బాధ్యుడిగా భావించే సింఘాల్ ను పక్కకు తప్పించినట్లు వినిపిస్తోంది. అయితే ఆయనకు ఏమాత్రం ముడిపెట్టలేని, ఆయనకు బాధ్యతలేని పరిణామాలకు కూడా ఆయననే నిందించేలా ప్రభుత్వం చర్య తీసుకున్నదని కొందరి వాదన. ఆయనను అనమాన కరమైన రీతిలో పంపించారని అంటున్నారు.
ఇంతకూ గరుడసేవ రోజు ఏం జరిగింది?
గరుడసేవ రోజున రాష్ట్రప్రభుత్వం, ప్రజల తరఫున ముఖ్యమంత్రి తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీ. ఈసారి జగన్ రాక సందర్భంగా.. అన్యమతస్తుడు గనుక.. ఆయన డిక్లరేషన్ పై సంతకం చేసి తీరాలని హిందూత్వ వర్గాలు పట్టుపట్టడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ, తెలుగుదేశం పార్టీలు సంతకం కోసం డిమాండ్ చేయడంతో వైఎస్సార్ సీపీ కూడా సంతకం చేయరాదని చాలా పట్టుదలగా అనుకుంది.
నిజానికి ఈ మొత్తం ఎపిసోడ్ తో ఈవో సింఘాల్ కు ఎలాంటి సంబంధం ఉండదు. కాకపోతే.. వివాదం ముదురుతున్నది గనుక.. వైఎస్సార్ సీపీ తరఫున రక్షణ కవచంలాగా చాలా మంది మంత్రులు, నాయకులు గరుడసేవ నాడు తిరుమలలో మోహరించారు. మామూలుగా సీఎం వస్తారు, దేవాదాయ శాఖ మంత్రి ఉంటారు.
ఈసారి తిరుమలలో ఏదో యుద్ధం జరగబోతున్నట్లుగా, డిఫెన్సుకు గట్టి నాయకులు అవసరం అన్నట్టుగా అనేకమంది ఆరోజున అక్కడకు చేరారు. వారిలో హిందూత్వంపై, ఆచారాలపై, ప్రత్యేకించి ఆలయాల్లో దర్శనాలు- మతమార్పిడికి అవే కారణం అనే అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ తదితరులందరూ తిరుమలలో ఆరోజున ఉన్నారు. వారిలో ఇద్దరు మంత్రులకు కరోనా వచ్చింది. కార్యక్రమంలో సీఎం వెంట పాల్గొన్న వారిలో దాదాపు 150 నుంచి 200 మందికి కరోనా సోకినట్టుగా అనధికార సమాచారం వ్యాప్తిలో ఉంది.
మామూలుగా సీఎం వెంట పార్టీ నాయకులు పలువురు గరుడసేవ రోజున ఆలయానికి రావడం పరిపాటి. కానీ ఈసారి చాలా పెద్ద సంఖ్యలో చాలా మంది నాయకులు అక్కడకు వచ్చారు. ఎక్కడా అదుపులేదు. దాంతో కరోనా సోకింది. అందరికీ వైద్య పరీక్షలు చేయించి అనుమతించడంలో ఈవో విఫలం అయ్యారని ఆయన మీద ముద్ర వేశారు. హఠాత్ బదిలీకి అదే కారణం అని స్థానికంగా అనుకుంటున్నారు.
కరోనా ఎలా వచ్చింది..
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే సిబ్బందిలో డాలర్ శేషాద్రికి కరోనా వచ్చింది. ఆయన సాధారణంగా అందరు ప్రముఖులు, వీఐపీల పర్యటనల సమయంలో కీలకంగా మెలగుతుంటారు. ఆయననుంచే పలువురికి సోకి ఉంటుందనే ప్రచారం కూడా ఉంది. ఆయనను చెన్నైలో ప్రముఖ ప్రెవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈలోగా మంత్రులు వెలంపల్లికి, వేణుగోపాల కృష్ణకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. నాయకులు చాలా మందికి కరోనా వచ్చినట్టు తేలింది. దీంతో ఈవో పై ఆగ్రహించారు.
ఈవో పరిధిలో ఆలయ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరికీ కూడా వైద్య పరీక్షలు చేయించిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఈసారి కూడా అలాగే చేశారు. అయితే పార్టీ నాయకులు అంచనాలకు మించి పెద్దసంఖ్యలో వచ్చేయడంతో వారిని అదుపు చేయడం గానీ, వారందరికీ పరీక్షలు చేయించడం గానీ.. ఈవో పరిధిలో లేకుండాపోయింది. కానీ ఆయనే బాధ్యుడిగా మారవలసి వచ్చింది.
సింఘాల్ ఊహించలేదు
అనిల్ కుమార్ సింఘాల్.. ఇంత త్వరగా తనను తిరుమలేశుని విధుల నుంచి తప్పిస్తారని మాత్రం ఊహించలేదని సమాచారం. ఆయన ఈ పదవిలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు. అనిల్ కుమార్ సింఘాల్ కు భారతీయ జనతా పార్టీ, కేంద్రంలోని పెద్దలతో సత్సంబంధాలున్నాయని అనుకుంటూ ఉంటారు. ఆయనకు ఇటీవలే కేంద్ర సర్వీసుల్లో అదనపు కార్యదర్శి స్థాయికి ప్రమోషన్ వచ్చింది.
అయితే, ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత తాను టీటీడీ విధుల్లో ఉండనని, కేంద్ర సర్వీసులకు వెళ్తానని ఆయన చాలా కాలంగా సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. కానీ.. ఒక బ్రహ్మోత్సవం ఇంకా మిగిలుండగానే.. ఆయన బదిలీ కావడమే అవమానకరం అని పలువురు భావిస్తున్నారు. ఇక్కడినుంచి వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేసినప్పటికీ.. ఆ పోస్టులో ఆయన ఎక్కువ కాలం ఉండరని, తొందర్లోనే కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతారని తెలుస్తోంది. ఆయన కెరీర్ లో కేంద్ర కేబినెట్ కార్యదర్శి హోదాలో రిటైరయ్యే అవకాశం ఉంది. అందుకే ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్తారు. కాకపోతే.. జగన్ సర్కారు తొందరపడి ముందే ఆయనను బదిలీ చేసింది.
నాయకులకు కరోనా రావడానికి ఈవో సింఘాల్ ను కారకుడిగా జగన్మోహన్ రెడ్డి భావించారా? ఆయన హఠాత్ బదిలీకి కారణం జగన్ ఆగ్రహమా? లేదా తొందరపాటు తనమా? అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది.
.. సురేష్ పిళ్లె











