టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి రావడమే ఆలస్యం.. జనాలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. దాదాపు మూడు నెలల తర్వాత చంద్రబాబు మళ్లీ ప్రజా కార్యక్రమంలో నేరుగా పాల్గొనడంతో అడుగడుగునా ప్రజలు చంద్రబాబుకు పూలతో స్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా స్కిల్ డెవలప్ మెంట్ కేసు అంటూ పెట్టి.. సెప్టెంబరు 8 అర్ధరాత్రి సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 52 రోజులు జైల్లో ఉన్న చంద్రబాబు బెయిల్పై విడుదలైనప్పటికీ.. కంటి ఆపరేషన్, పుణ్యక్షేత్రాలను సందర్శన కారణంగా ప్రజా కార్యక్రమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. తాజాగా మిగ్జాం తుపాను వల్ల నష్టపోయిన రైతులను, బాధితులను పరామర్శించడానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో శుక్రవారం పర్యటించారు.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు వద్ద టీడీపీ, జనసేన శ్రేణులు, మహిళలు, ప్రజలు చంద్రబాబుపై పూలవర్షం కురిపించి హారతులు ఇచ్చి మరీ ఆహ్వానం పలికారు. తెనాలిలో వీఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ నుంచి వైకుంఠపురం దాకా రోడ్డుకు రెండు వైపులా వేల సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు గంటల తరబడి నిలబడి.. చంద్రబాబు కోసం వేచి చూశారు. అలా చంద్రబాబు కాన్వాయ్ 20 కిలో మీటర్ల దూరం ప్రయాణించడానికి దాదాపుగా 6 గంటల సమయం పట్టింది.
చంద్రబాబు ఈ పర్యటనలో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆయా గ్రామాల్లో రైతులతో పాటు వైఎస్ఆర్ సీపీ నేతలు కూడా చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో తమ ప్రాంతంలో ఒక్క కాల్వ కూడా బాగుచేయలేదని.. పంటలు దెబ్బతింటే పరిహారం కూడా ప్రభుత్వం ఇవ్వలేదని వైఎస్ఆర్ సీపీ నేతలు చంద్రబాబు దగ్గర వాపోయారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం దగ్గర స్థానిక వైఎస్ఆర్ సీపీ నేతలు రామకృష్ణ, సురేశ్, వజీర్ తదితరులు.. తెనాలి మండలం నందివెలుగు దగ్గర అత్తోట వైఎస్ఆర్ సీపీ నాయకుడు, రైతు అయినా దండా వెంకటేశ్వరరావు సహా జగన్ పార్టీ కార్యకర్తలు చంద్రబాబును కలిసి తమ ఆవేదన చెప్పుకున్నారు.
తుపాను వల్ల తమ పంటలు దెబ్బతింటే.. తమ ప్రభుత్వం ఉన్నప్పటికీ తమకు ఏ ప్రయోజనం అందడం లేదని వైఎస్ఆర్ సీపీ నాయకులు వాపోయారు. నాలుగు నెలల క్రితం వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఇంకా నష్టపరిహారం అందలేదని, తాజాగా తుపాను ధాటికి పంట మరింతగా నష్టపోయామని చంద్రబాబుతో వారు చెప్పారు. దాదాపు 90 శాతం పంట పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాల మీదుగా పోతున్న కాల్వలు, బాగు చేసి ఉంటే తుపాను పోయిన తర్వాత వరద నీరు వాటిగుండా పోయేదని, ఇంత ముప్పు వాటిల్లకుండా ఉండేదని అన్నారు. తాము 25 ఎకరాల దాకా కౌలుకు చేశామని, ఈ రోజుకు కూడా డ్రైయిన్ గుండా వెళ్లాల్సిన ముంపు నీరు పొలాల్లోకి వస్తోందని అన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. పార్టీలతో సంబంధం లేకుండా తాను రైతులను చూస్తానని చెప్పారు. దీన్ని తాను రాజకీయం చేయబోనని, ప్రతి రైతుకూ న్యాయం జరిగేదాకా పోరాడతానని వైఎస్ఆర్ సీపీ నేతలకు భరోసా కల్పించారు.











