ఏపీలో ఓ సీనియర్ IPS అధికారి తీరు ఇప్పుడూ చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో జగన్తో అంటకాగి..నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా టీడీపీ ముఖ్య నేతలందరిపై కేసుల బనాయింపులో కీలకంగా వ్యవహరించిన సదరు సీనియర్ ఐపీఎస్ అధికారి..ఇప్పుడు పూర్తిగా వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ సేవలో మునిగిపోయారు. జగన్ పాలనలో జరిగిన కుంభకోణాలు, అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తుంటే దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారు. ఆయా కేసుల్లో నిందితులు, అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులు, వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులిస్తే ఎలా సమాధానమివ్వాలి, విచారణ నుంచి తప్పించుకునేందుకు మార్గాలు ఏంటి..పరారీలో ఉన్నప్పుడు ఆచూకీ దొరక్కుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై సూచనలు ఇస్తున్నారు. ఇందుకోసం కొంతమంది పోలీసు అధికారులతో కలిసి ఓ పెద్ద నెట్వర్క్ నడిపిస్తున్నారు. ఆయా కేసులు దర్యాప్తు చేస్తున్న వారిని పరోక్షంగా బెదిరిస్తున్నారని సమాచారం.
ఆ అధికారులకు నిధులు
వైసీపీ ఐదేళ్ల పాలనలో చట్టవిరుద్ధంగా వ్యవహరించి..ఆ పార్టీకి కొమ్ముకాసిన పలువురు ఐపీఎస్ అధికారుల అక్రమాలు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఆ అధికారులకు భయపడి సైలెంట్ అయిన బాధితులు ఇప్పుడు ధైర్యం చేసి ఫిర్యాదులిస్తున్నారు. అలాంటి అరాచక అధికారుల్లో పలువురు సస్పెన్షన్లో, వెయిటింగ్లో ఉన్నారు. వీరిలో కొంతమందిని కలిపి ఆయన ఓ సమాంతర నెట్వర్క్ను నడిపిస్తున్నారు. వారిలో చాలా మందికి ఎప్పటికప్పుడు నిధులు సమకూరుస్తున్నారు. వారి ఆర్థిక అవసరాలకు డబ్బు సర్దుబాటు చేస్తున్నారు. ఆయా ఐపీఎస్ అధికారులతో పాటు కొంతమంది డీఎస్పీలు, అదనపు ఎస్పీలతో నిరంతరం టచ్లో ఉంటూ వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిస్తున్నారు. ఆ అధికారి సమకూరుస్తున్న డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ఆయనకు ఎవరి ద్వారా, ఏయే మార్గాల్లో అందుతోంది అనేదానిపై పోలీసు శాఖ ఆరా తీస్తోంది.
కేసులు ఎదుర్కొంటున్న కొందరు అధికారుల తరపున న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసేందుకు, వాదించేందుకు వీలుగా అత్యంత ఖరీదైన న్యాయవాదులను ఆ సీనియర్ ఐపీఎస్ అధికారే ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఏదైనా కేసులో నోటీసులు అందితే..వాటికి ఎలా స్పందించాలి? లిఖితపూర్వక సమాధానం ఎలా ఇవ్వాలి? విచారణకు పిలిస్తే ఏం సమాధానం చెప్పాలి? వంటి అంశాలన్నింటిపైనా ఆయనే వారికి మార్గనిర్దేశం చేస్తున్నారని సమాచారం. ఓ కేసులో న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలమివ్వడానికి ముందుకొచ్చిన ఓ అధికారి..ఆ తర్వాత దానికి నిరాకరించారు. మౌనం వహించే హక్కు తనకుందంటూ సమాధానమిచ్చారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సూచనల మేరకే ఆయన ఇలా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. మద్యం కుంభకోణంలో కీలకపాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డికి సిట్ ఎన్నిసార్లు నోటీసులు ఇస్తున్నా విచారణకు హాజరుకాకపోవడం, పరారీలోకి వెళ్లిపోవడం వెనక ఆ అధికారే ఉన్నట్లు సమాచారం.
పీఎస్ అధికారుల మధ్య విభేదాలు సృష్టించేందుకు, వర్గాలు ఏర్పడేలా చేసేందుకు..అసత్య కథనాలు, తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేయడంలో ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి మాస్టర్ మైండ్గా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. సస్పెన్షన్కు గురైన ఆ అధికారి.. నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్క్వార్టరైన విజయవాడ వీడి వెళ్లకూడదు. కానీ అందుకు విరుద్ధంగా హైదరాబాద్లో ఉంటూ…ప్రభుత్వ వ్యతిరేక కార్యకలపాల్లో పాలు పంచుకుంటున్నారు.