ఏపీలో విద్యుత్ ఛార్జీలు ప్రజలకు షాకులిస్తున్నాయి. కరెంటు ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. నెల నెలా రూ.300 మేరకు బిల్లు వచ్చే సాధారణ వినియోగదారుని కుటుంబం.. రూ.1200-రూ.1300 వరకు చెల్లించాల్సి వస్తోంది. దీనికి కారణం… సర్చార్జీల బాదుడే!మరీ ఈ మోతకు కారణం ఎవరు. అని ప్రశ్నించుకుంటే వచ్చే ఒకే ఒక్క సమాధానం జగన్ రెడ్డి. మరి ఆయన హయాంలో ఏం జరిగింది? ఇప్పుడు ఈ బిల్లు తిప్పలు ఎందుకు వచ్చాయి? ఛార్జీల భారం నుంచి తప్పించుకునేందుకు సర్కార్ చేస్తున్న ప్రయత్నం ఏంటి.
నాటి జగన్ ప్రభుత్వం అనుసరించిన అడ్డగోలు విధానాల పాపం..ఇప్పటికీ వెంటాడుతోంది. భారీ ధరకు కరెంటు కొనుగోళ్లు, నాడు ఉత్పత్తి పెంచకపోవడం తదితర కారణాలతో డిస్కమ్లపై భారం పెరిగిపోయింది. ఆ భారాన్ని సర్చార్జీల రూపంలో జనంపై బాదడం మొదలైంది. వైసీపీ సర్కారు పోయినా..భారం మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే..ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ భారాలను తగ్గించేందుకు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా విద్యుత్ వ్యవస్థను సంస్కరిస్తోంది. గడిచిన 10 నెలల కాలంలోనే ఉత్పత్తిని పెంచేసింది. తో పెరిగిన వినియోగానికి తగిన విధంగా సరఫరా చేస్తూ.. రూ.5 వేల కోట్ల మేరకు కొనుగోలు భారం నుంచి తప్పించుకుంది. రాబోయే రోజుల్లో మరిన్ని పొదుపులకు మార్గం సుగమం చేస్తోంది. అయితే, అప్పటి వరకు ప్రజలకు జగన్ షాకులు తగులుతూనే ఉంటాయి.
జగన్ ప్రభుత్వం దిగిపోయి దాదాపు పదిమాసాలైంది. అయిప్పటికీ కరెంటు చార్జీల మోత మోగుతూనే ఉంది. ట్రూ అప్, ఇంధన సర్దుబాటు అంటూ..డిస్కమ్లు బిల్లుల్లో బాదేస్తున్నాయి. దీంతో సగటు వినియోగదారులు తల్లడిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని సంక్షోభానికి గురిచేసి ఖాయిలా పడే పరిస్థితిని తీసుకొచ్చింది. దీంతో ప్రజలపై చార్జీల భారాన్ని ఇప్పటికిప్పుడు తగ్గించాలని కూటమి ప్రభుత్వానికి ఉన్నప్పటికీ..సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ధరలు పెరగకుండా చూసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. గతంలో నెలకు రూ.300 బిల్లు వచ్చే వినియోగదారుని కుటుంబాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఫిక్స్డ్ చార్జీలు రూ.50, ఎలక్ట్రిసిటీ డ్యూటీ కింద రూ.28.98తోపాటు ఇంధన సర్దుబాటు చార్జీల కింద రూ.425.15 చెల్లించాల్సి వస్తోంది. ఇందులోనూ సర్డుబాటు ధరల పోటు..ఏటా మారిపోతోంది.
అంతేకాదు..డబుల్ సర్దుబాటు కూడా పడుతోంది. 2023-24లో సర్దుబాటు చార్జీల కింద 304.39, 2024-25లో మరో ఇంధన సర్దుబాటు చార్జీల కింద రూ.152.80 వసూలు చేస్తున్నారు. మొత్తానికి వినియోగించిన విద్యుత్ చార్జీకి అదనంగా ప్రతి నెలా రూ.వెయ్యి పంపిణీ సంస్థలు వసూలు చేస్తున్నాయి. దీంతో గతంలో నెలకు రూ.300 బిల్లు వచ్చే వినియోగదారుడికి రూ.1,200 నుంచి రూ.1,530 దాకా వస్తోంది. అలానే.. ఒక కుటుంబం నెలకు 370 యూనిట్లు వాడితే.. రూ.3357.50 బిల్లు కట్టాల్సి వస్తోంది. ఎలా చూసుకున్నా సగటున రూ.800 అదనపు భారం ఒక్కొక్క కుటుంబంపై పడుతోంది.
ఐతే చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తికే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ జెన్కో రోజుకు 230 మిలియన్ యూనిట్ల డిమాండ్ను కూడా తట్టుకునేలా విద్యుదుత్పత్తి చేస్తుండడం విశేషం. బయట నుంచి కేవలం 7.967 మిలియన్ యూనిట్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. గడచిన 9 నెలలుగా ఏపీజెన్కో కేంద్రాల నుంచి గరిష్ఠ స్థాయిలో విద్యుదుత్పత్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా బహిరంగ మార్కెట్ నుంచి కరెంటు కొనుగోళ్లు తగ్గి రూ.5467 కోట్ల మేర ఆదా చేశారు.
2019-24 మధ్య కాలంలో ఏపీ జెక్కో విద్యుదుత్పత్తి సంస్థలు విద్యుత్తు ఉత్పత్తి చేయలేదు. దీంతో వినియోగానికి అవసరమైన మేరకు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్తును కొనుగోలు చేశారు. జగన్ హయాంలో డిస్కమ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించి అధిక ధరలకు ట్రాన్స్ఫార్మర్లను కొన్నాయి. బహిరంగ మార్కెట్లో కరెంటును.. బొగ్గును కూడా చేతికి ఎముక లేదన్నట్టుగా చెప్పిన ధరకు కొనుగోలు చేశాయి. ఈ ఇష్టారాజ్యం నిర్ణయాల ఫలితంగానే..ట్రూఅప్, ఇంధన సర్దుబాటు చార్జీల భారం వినియోగదారులపై పడింది.
వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో విద్యుత్తు చార్జీలను పెంచలేదు. కానీ ట్రూఅప్, ఇంధన సర్దుబాటు పేరిట 9 సార్లు ప్రజలను బాదేశారు. ఇది ఆ రోజుకు, లేదా ఆ సంవత్సరానికి పరిమితం కాలేదు. కొన్నేళ్లపాటు ప్రజలు ఈ భారాన్ని మోసేలా జగన్ దొంగదెబ్బకొట్టారు. 2022-23లో ఇంధన సర్దుబాటు చార్జీల కింద రూ.6,300 కోట్లు మోపారు. 2023-24లో మరోసారి ఇంధన సర్దుబాటు చార్జీలు కింద రూ.9,200 కోట్ల భారం వేశారు. మొత్తంగా ఆరెండేళ్లలోనే 15,500 కోట్ల మేర కు సర్దుబాటు పేరుతో మోత మోగించారు. వీటికితోడు ఫిక్స్డ్ చార్జీలు రూ.50, ఎలక్ట్రిసిటీ డ్యూటీ కింద రూ.28.98 వసూలు చేస్తున్నారు.