Nకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏపీకి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. అనంతపురం జిల్లాలో మరో భారీ ప్రాజెక్టు రాబోతుంది. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చే క్రమంలో, ప్రముఖ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ సుజ్లాన్ గ్రూప్ ఏకంగా రూ.10,000 కోట్ల భారీ పెట్టుబడితో అనంతపురంలో అడుగుపెడుతోంది. ఈ ప్రతిష్టాత్మక మెగా ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేశ్ ఇవాళ భూమిపూజ చేయనున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1,325 మెగావాట్ల కెపాసిటీతో విండ్ పవర్ స్టేషన్లను సుజ్లాన్ నిర్మించనుంది. ఇవాళ మంత్రి లోకేశ్ ముందుగా బళ్లారి పరిధిలోని హలకుందిలో ఉన్న సుజ్లాన్ బ్లేడ్ స్టాక్ యార్డును పరిశీలిస్తారు. అనంతరం రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామంలో విండ్ పవర్ ప్రాజెక్టులతో పాటు, అత్యాధునిక సాంకేతికతతో కూడిన సుజ్లాన్ S144 విండ్ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్కు శంకుస్థాపన చేస్తారు.
వెనుకబడిన జిల్లాగా పేరున్న అనంతపురం రూపురేఖలను ఈ ప్రాజెక్టు మార్చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణ, నిర్వహణ దశల్లో స్థానికంగా సుమారు 4,000 మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. కేవలం ఉపాధి కల్పనతోనే సరిపెట్టకుండా..రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్రీన్ ఎనర్జీ రంగంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చేందుకు సుజ్లాన్ ప్రత్యేక కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేస్తోంది.
2030 నాటికి రాష్ట్రంలో 5 గిగావాట్ల పునరుత్పాదక శక్తి ఉత్పత్తి లక్ష్యంగా అడుగులు వేస్తున్న సుజ్లాన్ ప్రాజెక్టుతో అనంతలో వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు మరింత పుంజుకోనున్నాయి. పెట్టుబడిదారుల్లో కూటమి ప్రభుత్వం నింపిన భరోసాకు ఈ మెగా ప్రాజెక్టే నిలువెత్తు సాక్ష్యం.











