ఓ హీరోయిన్ కు ఎన్ని అవకాశాలుంటాయో, అన్ని అవకాశాల్ని తెరుస్తోంది తమన్న. కొందరు హీరోయిన్లు చాలా తక్కువ దారుల్లో మాత్రమే వెళ్తారు. కానీ తమన్న అలా కాదు. తన కెరీర్ ను పొడిగించుకోవడం కోసం
అందివచ్చిన ప్రతి అవకాశాన్ని, కనిపిస్తున్న ప్రతి దారిని అందిపుచ్చుకుంటోంది. జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు బుల్లితెరపై తన హవా చూపించబోతోంది.
జెమినీ ఛానల్ పై ఓ కార్యక్రమం చేసేందుకు అంగీకరించింది తమన్న. ఇదొక కుకింగ్ షో. మాస్టర్ చెఫ్ తరహాలో గ్రాండ్ గా జరుగుతుంది. దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు ఒప్పుకుంది మిల్కీబ్యూటీ. దీనికోసం ఆమె భారీగానే డీల్ సెట్ చేసుకుంది. ఇంకా చెప్పాలంటే, సినిమా ఆఫర్ కంటే ఈ టెలివిజన్ ఆఫర్ తోనే ఆమెకు ఎక్కువ ఎమౌంట్ అందుతోందట. కన్నడలో ఇదే షో చేయడానికి సుదీప్ ను తీసుకున్నారు, తెలుగులో తమన్న ఆ రోల్ పోషించబోతోంది.
చాలా రోజుల కిందటే కొత్త దారులు వెదకడం స్టార్ట్ చేసింది మిల్కీబ్యూటీ. అందులో భాగంగా ఓటీటీలో అడుగుపెట్టింది. ముందుగా ఆహాలో లెవెన్త్ అవర్ చేసింది. ఆ తర్వాత మరో వెబ్ డ్రామా కూడా చకచకా పూర్తిచేసింది. ఇకపై కూడా వెబ్ సిరీస్ లు, ఒరిజినల్ మూవీస్ చేస్తానని ప్రకటించింది. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో కూడా ఆమె ఓ షో చేయబోతోందని టాక్.
ఇక పాత్రల పరంగా చూసుకుంటే ఇప్పటికే హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఈ చిన్నది, ఇప్పుడు విలన్ పాత్రలకు కూడా ఓకే చెప్పింది. నితిన్ హీరోగా నటిస్తున్న మ్యాస్ట్రో సినిమాలో విలన్ తమన్నానే. కెరీర్ లో ఆమె చేస్తున్న తొలి నెగెటివ్ క్యారెక్టర్ ఇది. దీంతో పాటు ఆమె ఎప్పట్నుంచో ఐటెంసాంగ్స్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నో ఐటెంసాంగ్స్ చేసింది. రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది.
ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే, ఇప్పుడు హీరోల విషయంలో కూడా పట్టింపులకు పోవడం లేదు మిల్కీబ్యూటీ. ఈ స్థాయి హీరోయిన్లు, హీరోల విషయంలో కాస్త నిక్కచ్చిగా ఉంటారు. కానీ తమన్న మాత్రం కొత్త వాళ్లతో చేసేందుకు కూడా ఓకే చెప్పేసింది. ఇందులో భాగంగా సత్యదేవ్ లాంటి హీరో సరసన కూడా నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గుర్తుందా శీతాకాలం అనే సినిమా చేస్తోంది. ఇలా ఒక హీరోయిన్ ఎన్ని చేయగలదో, అన్ని విభాగల్లో తమన్న ప్రయత్నిస్తోంది. బిజీగా ఉండడం, డబ్బు సంపాదించడం ఎలాగో ఈ బ్యూటీకి బాగా తెలుసు.