రాఘవేంద్రరావు సినిమాల్లో రొమాంటిక్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. మాటల్లోను .. పాటల్లోను కూడా ఆయన ఆ రొమాన్స్ పాళ్లు తగ్గకుండా చూసుకునేవారు. ఇక హీరోయిన్లను ఆయన చూపించినంత గ్లామరస్ గా వేరెవరూ చూపించలేరని చెప్పుకుంటారు. ఈ కారణంగా ఆయన సినిమాల్లో తప్పకుండా చేయాలని కొత్త హీరోయిన్లు ఉత్సాహ పడుతుంటారు. ఆయన సినిమాల్లో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు కూడా ఉంటూ ఉంటారు. ఈ సారి ఆయన నలుగురు హీరోయిన్లతో చేయనున్నారనే ఒక వార్త షికారు చేసింది. ప్రధాన పాత్రలో ఆయనే కనిపించనున్నాడనే సరికి అంతా షాక్ అయ్యారు.
రాఘవేంద్రరావు హీరోగా చేయనున్నారా? అని అంతా ఆశ్చర్యపోయారు. దర్శకుడిగా తనికెళ్ల భరణి పేరు వినిపించడంతో ఆసక్తిని చూపించారు. కథ ప్రకారం రాఘవేంద్రరావుని ఎలా చూపిస్తారో తెలియదుగానీ, ప్రధానమైన పాత్రలో ఆయన కనిపించనున్నాడనేది మాత్త్రం వాస్తవం. ఆ విషయాన్ని గురించి తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో తనికెళ్ల భరణి ప్రస్తావించారు. “ఒకసారి రచయిత ‘జనార్దన మహర్షి’ నా దగ్గరికి వచ్చాడు. తను ఒక కథను రెడీ చేశాననీ, ఆ కథను రాఘవేంద్రరావుగారితో చేస్తే బాగుంటుందని అన్నాడు. చాలా పొదుపుగా మాట్లాడే రాఘవేంద్రరావుగారు, నటించడానికి అంగీకరించకపోవచ్చని అన్నాను.
జనార్దన మహర్షి కథ చెప్పడానికి వెళితే, నటన పట్ల అయిష్టతను వ్యక్తం చేస్తూ రాఘవేంద్రరావుగారు కథ వినలేదు. అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చిన మహర్షి, నాకు ఆ కథను వినిపించాడు. కథ చాలా కొత్తగా అనిపించింది .. బాగుంది. దాంతో నేను రాఘవేంద్రరావుగారికి కాల్ చేసి, “కథ బాగుంది .. మీకు నటించడం ఇష్టం లేకపోయినా ఒకసారి విని చూడండి ..” అన్నాను.” అవునా .. అయితే సరే .. పంపించు” అన్నారు. అప్పుడు మహర్షి మళ్లీ వెళ్లి వినిపిస్తే రాఘవేంద్రరావుగారికి కూడా కథ బాగా నచ్చింది. “మరి దర్శకుడు ఎవరు?” అని ఆయన అడిగేసరికి మహర్షి నా పేరు చెప్పాడట. తనికెళ్ల భరణి డైరెక్షన్ అయితే ఓకే” అని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 100 సినిమాలకి పైగా దర్శకత్వం వహించిన దర్శకేంద్రుడిని డైరెక్ట్ చేసే అవకాశం రావడం, నిజంగా నా అదృష్టం” అని చెప్పుకొచ్చారు.