తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ మాజీ విప్, విజయనగరం జిల్లా చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు శనివారం బీజేపీలో చేరారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో కండువా మార్చుకున్నారు.
హవా తగ్గడమే ..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి క్రియాశీలకంగా వ్యవహరించిన గద్దె బాబురావు రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా, ఒకసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించారు. ఎన్టీఆర్ హయాంలో రాష్ట్ర స్థాయిలో ఒక వెలుగు వెలిగి , విజయనగరం జిల్లాలో టీడీపీకి అంతా తానై వ్యవహరించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టాక ఈయన హవా కొంత తగ్గింది. 2004 తరువాత పార్టీలోకి యువతరం రావడం, అశోకగజపతి రాజు క్రియాశీలకంగా వ్యవహరించడంతో గద్దె ప్రభావం కనుమరుగైంది.
గతంలోనూ ..
గద్దె బాబురావు టీడీపీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు వివిధ సందర్భాలలో రెండుసార్లు పార్టీపై అలిగి రాజీనామా చేశారు. ఒకసారి వైసీపీలో చేరారు. అక్కడ ఇమడలేక గత సాధారణ ఎన్నికల ముందు మళ్లీ టీడీపీలోకి వచ్చారు. చీపురుపల్లి నుండి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు.
అధ్యక్ష పదవిపై ఆశతో ..
విజయనగరం జిల్లాలో అంతర్గత విభేదాలతో ఉన్న కొద్దిపాటి ఉనికినీ కోల్పోతున్న బీజేపి అధ్యక్ష పీఠం కైవసం చేసుకుని తన ఉనికిని కాపాడుకునేందుకు గుద్దే పార్టీ ఫిరాయించినట్లు తెలుస్తోంది. మూడు గ్రూపులు, ఆరు వర్గాలతో కునారిల్లుతున్న బీజేపీలో ఈయన ఎంతకాలం ఉంటారనేది, ఆ పార్టీను ఏ విధంగా గాడిలో పెడతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే.