టీడీపీ,బీజేపీ కూటమి మరో ఘనత సాధించింది. అండమాన్ – నికోబార్ దీవుల్లో సత్తా చాటింది. విజయపురం మున్సిపల్ ఛైర్పర్సన్గా టీడీపీకి చెందిన ఎస్.షాహుల్ హమీద్ గురువారం ఎన్నికయ్యారు. మున్సిపాలిటీకి 2022-23లో నిర్వహించిన ఎన్నికల్లో ఏ పార్టీకీ ఆధిక్యం లభించని కారణంగా బీజేపీ, టీడీపీ సభ్యులు కూటమిగా ఏర్పడి ఏడాదికి ఒకరు చొప్పున ఛైర్పర్సన్గా ఉండాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదటి ఏడాది బీజేపీ, రెండో ఏడాది టీడీపీ సభ్యుడు ఛైర్పర్సన్గా ఉన్నారు. మూడో ఏడాది మారిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ సభ్యుడు ఛైర్పర్సన్గా ఎన్నికయ్యారు.
ఈ సారి (2025-26) నిర్వహించిన ఎన్నికల్లో బీజేపీతో పాటు స్వతంత్ర సభ్యుడి మద్దతుతో టీడీపీ సభ్యుడు హమీద్ ఛైర్పర్సన్గా గెలుపొందారు. మొత్తం 24 ఓట్లలో హమీద్ 15 ఓట్లు సాధించి ప్రస్తుత మున్సిపల్ ఛైర్పర్సన్ సుదీప్ రాయ్ శర్మ – కాంగ్రెస్ను ఓడించారు. ఇక్కడ మున్సిపల్ చట్టం ప్రకారం ఏ పార్టీకి ఆధిక్యం ఉన్నా లేకపోయినా ఛైర్పర్సన్ స్థానానికి ఏటా ఎన్నికలు నిర్వహిస్తారు. హమీద్ విజయానికి ఎంతో కృషి చేసిన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, అండమాన్ రాష్ట్ర ఇన్ఛార్జి వి.మాధవనాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజోయ్ బైరాగి, ఎన్నికల కమిటీ సభ్యులకు అండమాన్, నికోబార్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎస్.మాణిక్యరావు యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబు హర్షం
ప్రజా సంక్షేమమే ఎజెండాగా టీడీపీ పనిచేస్తుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అండమాన్ నికోబార్లో శ్రీ విజయపురం మున్సిపల్ కౌన్సిల్ ఛైర్పర్సన్ పదవికి టీడీపీకి చెందిన షాహుల్ హమీద్ ఎన్నికవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు. అక్కడి నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.