ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గత వైసీపీ జరిగిన వేల కోట్ల విలువైన లిక్కర్ స్కామ్లో అంతిమంగా లబ్ధి పొందిన వ్యక్తి నాటి సీఎం జగన్మోహన్ రెడ్డేనని సిట్ దర్యాప్తులో తేలింది. లిక్కర్ సప్లై చేసే కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ కెసిరెడ్డి…ప్రతి నెలా రూ.50-60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మంతా జగన్కే చేర్చేవారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరుడైన వై.ఎస్.అనిల్రెడ్డి (జగన్ పెదనాన్న వై.ఎస్.జార్జిరెడ్డి రెండో కుమారుడు), భారతి సిమెంట్స్లో పూర్తికాలపు డైరెక్టర్గా కొనసాగుతున్న, జగన్ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీ, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, విజయసాయిరెడ్డిల ద్వారా ఈ ముడుపుల సొత్తు మొత్తం జగన్కు అందజేసేవారని నిర్ధారించింది.
2019-24 మధ్య ఇలా రూ.3,200 కోట్ల మేర ముడుపులు వసూలు చేశారని వెల్లడించింది. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు (A1) రాజ్ కెసిరెడ్డి ప్రతినిధిగా ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన బూనేటి చాణక్య అలియాస్ ప్రకాశ్ (A8)ను సిట్ అధికారులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం విజయవాడలోని ACB స్పెషల్ కోర్టులో హాజరుపరుచగా..14 రోజుల పాటు రిమాండు విధించారు. సిట్ అధికారులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండు రిపోర్టులో ఇప్పటివరకూ దర్యాప్తులో గుర్తించిన వివరాలన్నింటినీ పొందుపరిచారు.
బేస్ ప్రైజ్పై 20 శాతం కమీషన్ –
నంద్యాలలోని SPY అగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్రెడ్డి (A6).2019లో హైదరాబాద్లో డిస్టిలరీల యజమానులతో సమావేశం నిర్వహించారు. ముడుపులు చెల్లించే కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇస్తామని.. తమ ప్రతిపాదనకు అంగీకరించకపోతే నష్టపోతారని బెదిరించారు. దీంతో పలు డిస్టిలరీల ప్రతినిధులు బేసిక్ప్రైస్పై 12 శాతం ముడుపులు చెల్లించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆ మొత్తాన్ని 20 శాతానికి పెంచేశారు. మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు ప్రతి నెలా సగటున రూ.50-60 కోట్ల మేర ముడుపుల సొమ్మును రాజ్ కెసిరెడ్డి బృందానికి అందజేసేవి. ఆయన ఆ మొత్తాన్ని ఎంపీ మిథున్రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప బాలాజీ, వై.ఎస్.అనిల్రెడ్డికి చేర్చేవారు. వారంతా ఈ సొత్తును జగన్కు బదలాయించేవారు. అదాన్, లీలా డిస్టిలరీలకు నిబంధనలు ఉల్లంఘించి అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు. ఆ బ్రాండ్ల మద్యమే ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించేవారు. విశాఖ డిస్టిలరీ, పీఎంకే డిస్టిలరీ, ఎస్పీవై డిస్టిలరీ, ఎంబీడీఎల్ డిస్టిలరీల ప్రాంగణాలు, యంత్రాల్ని అదాన్, లీలా డిస్టిలరీలు సబ్లీజు పేరిట మద్యం బ్రాండ్లు తయారు చేసేవి.
ఎంపీ మిథున్రెడ్డి కంపెనీలోకి రూ.5 కోట్లు
నంద్యాలలోని SPY ఆగ్రో ఇండస్ట్రీస్లో తయారైన మద్యం బ్రాండ్లకు విపరీతంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. ఆ డిస్టిలరీ బ్యాంకు లావాదేవీల విశ్లేషణలో.. సన్హోక్ ల్యాబ్స్, డీకార్ట్ లాజిస్టిక్స్ (ఏ16, రాజ్ కెసిరెడ్డి బినామీ సంస్థ), ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ మధ్య రూ.60 కోట్ల మేర రూటింగ్ జరిగినట్లు తేలింది. డీకార్ట్ లాజిస్టిక్స్ బ్యాంకు లావాదేవీలను విశ్లేషించగా.. 2021 అక్టోబరు 3న ఆ సంస్థ ఖాతా నుంచి PLR ప్రాజెక్ట్స్ ఖాతాలోకి రూ.5 కోట్లు జమయ్యాయి. డీకార్ట్ లాజిస్టిక్స్ అనేది ఒక అనుమానాస్పద సంస్థ. PLR ప్రాజెక్ట్స్ వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి చెందినది. ఆయన మద్యం కుంభకోణం కుట్రలో భాగస్వామి. అలాంటి వ్యక్తికి చెందిన కంపెనీ ఖాతాలోకి అనుమానాస్పద సంస్థ ఖాతా నుంచి నిధులు వెళ్లాయి. ఈ లావాదేవీలు జరిగిన తీరు చూస్తుంటే..ఇది భారీ అక్రమ చెల్లింపుల్లో భాగమా? క్విడ్ ప్రోకోనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
అదాన్ డిస్టిలరీస్ రూ.732 కోట్లు..లీలా డిస్టిలరీస్ రూ.454 కోట్లు
అదాన్ డిస్టిలరీస్ రాజ్ కెసిరెడ్డి, విజయసాయిరెడ్డిలదే. అందులో డైరెక్టర్లుగా ఉన్న కాశీచయనుల శ్రీనివాస్..విజయసాయిరెడ్డి ప్రతినిధి. ముప్పిడి అనిరుధ్రెడ్డి రాజ్ కెసిరెడ్డి ప్రతినిధి. 2020లో రూ.60 కోట్ల వర్కింగ్ క్యాపిటల్తో అదాన్ డిస్టిలరీస్ ఏర్పాటు చేశారు. విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్రెడ్డి, ఆయన సోదరుడు పెనక శరత్చంద్రారెడ్డి (దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు, అరబిందో సంస్థ యజమాని) ఖాతాల నుంచి కాశీచయనుల శ్రీనివాసుల ఖాతాలోకి వర్కింగ్ క్యాపిటల్ సొమ్ము మళ్లించారు. దీని వెనక ఉన్న భారీ కుట్రను వారే బయటపెట్టగలరు. దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నామన్నారు సిట్ అధికారులు. అదాన్ డిస్టిలరీస్ 2020 మే నుంచి 2022 డిసెంబరు మధ్య మూడేళ్లలో రూ.732 కోట్ల మేర వ్యాపారం చేసింది. రాజ్ కెసిరెడ్డి ఆధీనంలోని లీలా డిస్టిలరీ 2022 జూన్ నుంచి 2024 మార్చి మధ్య మూడేళ్లలో రూ.454 కోట్ల మేర వ్యాపారం చేసింది.
ప్రభుత్వంలోని కీలక వ్యక్తి సహకారంతో కుంభకోణం
2019 నుంచి 2024 మధ్య ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వ్యక్తి , ప్రభుత్వ అధికారుల సహకారంతో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. దీని వెనక భారీ కుట్ర ఉంది. దాన్ని వెలికితీస్తున్నామన్నారు అధికారులు. ఈ సిండికేట్లో రాజ్ కెసిరెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి, విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, మరికొందరు కీలక భాగస్వాములని చెప్పారు. ఈ మద్యం సిండికేట్ సభ్యులు వారి అధికారిక హోదాను, పరపతిని ఉపయోగించుకుని అనుచిత లబ్ధి పొందేందుకు ప్రభుత్వ ఖజానాకు రూ.3,200 కోట్ల మేర నష్టం కలిగించారు. ఈ మద్యం సిండికేట్ గ్రూపు.. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ పరపతి ఉపయోగించుకుంది. భారీ మొత్తాల్లో సొమ్ములు ‘కీ పొలిటికల్ ఫంక్షనరీస్’ APSBCL అధికారులకు చెల్లించారు.
ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లేవీ ప్రభుత్వ దుకాణాల్లో లభించకపోవటం పట్ల వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తమైనా సరే అప్పట్లో ప్రభుతాన్ని నడిపించిన రాజకీయ నాయకులు, అధికారులు ఎలాంటి దిద్దుబాటు చర్యలూ తీసుకోలేదు. ముడుపులు చెల్లించే కంపెనీల బ్రాండ్ల మద్యమే ప్రభుత్వ దుకాణాల్లో లభించేది. వినియోగదారులు కోరిన బ్రాండ్లేవీ ఉండేవి కాదు. APSBCL ప్రమోట్ చేస్తున్న బ్రాండ్ల నాణ్యతపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. నాటి అధికార పార్టీకి సంబంధించిన ‘అత్యున్నత పొలిటికల్ ఎగ్జిక్యూటివ్’ మద్దతు లేకుండా ఇది ఏ మాత్రం సాధ్యం కాదన్నారు సిట్ అధికారులు.
మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీలు కిక్ బ్యాక్స్ చెల్లించేందుకు అనేక పద్ధతులు అనుసరించేవి. మద్యం కొనుగోలుకు సంబంధించి APSBCL నుంచి వారి ఖాతాల్లో డబ్బులు జమ కాగానే.. ముడుపుల సొమ్మును బంగారం వ్యాపారుల ఖాతాల్లోకి మళ్లించేవి. వారి నుంచి బంగారం కొన్నట్లుగా జీఎస్టీ ఇన్ వాయిస్లు పొందేవి. ఆ వ్యాపారులు కమీషన్ మినహాయించుకుని మిగతా డబ్బును రాజ్ కెసిరెడ్డి, బూనేటి చాణక్య, వారి అనుచరులకు చెల్లించేవారు. సిట్ దర్యాప్తులో ఇలాంటి అనుమానాస్పద లావాదేవీలు అనేకం బయటపడ్డాయి.