మొదటి విడత ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు 63 గ్రామాల్లో విజయబావుటా ఎగురువేయడంతో ఆ పార్టీ నేతలు సంబరాల్లో ముగినిపోయారు. ముఖ్యంగా మేజర్ పంచాయితీల్లో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు తమ సత్తాచాటారు. జిల్లాల్లో మొదటి విడతలో 211 పంచాయతీలకు ఎన్నికలు ముగియగా అందులో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు 129 గెలిచారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థులు 63 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో మచిలీపట్నంలో టీడీపీ కార్యాలయంంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
వైసీపీ పతనం ప్రారంభమైంది..
పంచాయతీ ఎన్నికలతో వైసీపీ నేతల పతనం ప్రారంభమైందని మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర అభిప్రాయపడ్డారు. అధికార దాహంతో ఉన్న వైసీపీ నేతలు, నోటిఫికేషన్ విడుదల అయిన దగ్గర నుంచి ఎన్నికల్లో వైసీపీ గెలవాలని అనేక విధాలుగా కుట్రలు చేశారని ఆయన గుర్తుచేశారు. గ్రామాల్లో వైసీపీ నేతలు టీడీపీ అభ్యర్థులను భయపెట్టినా, బెదిరింపులకు దిగినా టీడీపీ నాయకులు ఎదురొడ్డి పోరాడారని కొల్లు కొనియాడారు. కొన్నిచోట్ల టీడీపీ అభ్యర్థులను కిడ్నప్ చేసినా, దాడులకు దిగినా టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గలేదని ఆయన గుర్తుచేశారు. వైసీపీ అరాచక పాలనకు పంచాయితీ ఎన్నికల ఫలితాలే చెంపపెట్టని కొల్లు రవీంధ్ర ధ్వజమెత్తారు.
మరో మూడు విడతల్లో సత్తా చాటుతాం..
రానున్న మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో కూడా టీడీపీ మంచి ఫలితాలు సాధిస్తుందని మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఎవరు అధైర్యపడవొద్దు ఆయన ధైర్యం చెప్పారు. పార్టీ నాయకత్వం కార్యకర్తలకు పూర్తి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన పని లేదని కొల్లు రవీంధ్ర పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.