వన్డే సిరీస్ లో జరిగిన పరాభవానికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఆసీస్ గడ్డపై టీ20 సిరీస్ ను దక్కించుకుంది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 2-0తో చేజిక్కించుకుంది. భారత జట్టు బ్యాటింగ్ లో సమష్టి ప్రదర్శన చేసినప్పటికీ… హార్దిక్ పాండ్య కేవలం 22 బంతుల్లో సాధించిన 42 పరుగులే జట్టును విజయతీరాలకు చేర్చాయి. ఆఖరి రెండు ఓవర్లు తనే స్ట్రైక్ లో ఉన్న పాండ్య.. చెలరేగి ఆడాడు. చివరి ఆరు బంతుల్లో 14 పరుగులు అవసరమైన క్లిష్ట సమయంలో పాండ్య ఏకంగా రెండు సిక్స్ లు కొట్టడంతో పాటు, రెండు బంతులు మిగిలి ఉండగానే.. విజయం దక్కించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 194 పరుగులు చేసింది. వేడ్ 59 పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీలకంగా నిలిచాడు. 25 బంతుల్లోనే ఆ స్కోరు అందుకున్న వేడ్ దూకుడుకు కోహ్లి రనౌట్ బ్రేక్ వేసింది. మిగిలిన వారిలో స్టీవ్ స్మిత్ 46 పరుగులు చేశాడు.
భారత ఇన్నింగ్స్ ఘనంగానే ప్రారంభం అయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (52) హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. కెఎల్ రాహుల్ (30), కొహ్లి (40), పాండ్య (42) అందరూ గౌరవప్రదమైన స్కోర్లే చేశారు. శామ్సన్ (15) అయ్యర్ (12) పరుగలతో భారత్ విజయం అందుకుంది.
ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ 2-0తో భారత్ వశమైంది. వన్డే సిరీస్ ను కోల్పోయినందుకు భారత జట్టు ఆ పరాభవాన్ని సరిదిద్దుకున్నట్లుగా అనిపించింది.











