ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ ఇంటిని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఇతర అనుబంధ సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. హోం మంత్రి ఇంటిగేటును తోసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై కాంగ్రెస్ పార్టీ గురువారం నిరసనకు దిగింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
ఒకపక్క రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే… రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని ప్రభుత్వం పేర్కొనడం బాధాకరమన్నారు. హత్యలు, అత్యాచారాలు కట్టడి చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వారు ఆరోపించారు. ఖమ్మంలో జరిగిన అత్యాచార ఘటనపై తెరాస నేతలు ఒక్కరు కూడా స్పందించారా? అని సంపత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలకు బాధ్యతవహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
అత్యాచారానికి ప్రతిఘటించడంతో ఆ బాలికపై పెట్రోల్ పోసి హత్యాయత్నం జరిగిన ఘటన తెలిసిందే. ఖమ్మంలో జరిగిన ఈ ఘటనలో ఆ బాలికకు 70 శాతం గాయాలైనట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ఆ బాలికకు హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్సను అందిస్తున్నారు.