ఏపీలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే కొంతమంది ప్రజా ప్రతినిధులు మాత్రం ఈ విధానాన్ని ఆదాయ వనరుగా భావిస్తున్నారు. ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తూ..ముక్కు పిండి అదనపు ధరలు వసూలు చేసి వినియోగదారులను పీడిస్తున్నారు.
వాళ్లు చెప్పిన ధరకే ఇసుక విక్రయాలు జరిగేలా చూస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా జోక్యం చేసుకొని, గుత్తేదారుల ద్వారా దందా నడిపిస్తుంటే, మరికొందరు పరోక్షంగా భాగస్వాములవుతున్నారు. ఇసుకలో నేతల జోక్యంపై ఇటీవల గనులశాఖ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. 17 మంది ప్రజాప్రతినిధులు ఇందులో పాత్రధారులుగా ఉన్నట్లు వెల్లడించింది.
వైసీపీ ప్రభుత్వం హయాంలో రీచ్లో టన్ను ఇసుక రూ.475తో విక్రయించారు. నిల్వ కేంద్రాల్లో ఇంకా అధికం. ప్రజలకు ఇది ఎంతో భారంగా ఉండేది. కొన్ని రీచ్లను మాత్రమే తెరిచి, కృత్రిమ కొరత సృష్టించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. తొలుత సీనరేజ్ ఫీజు, నిర్వహణ ఖర్చులు వసూలు చేసేవారు. తర్వాత ప్రభుత్వం సీనరేజ్ ఫీజు కూడా రద్దు చేసింది. దీంతో ధరలు తగ్గాయి. కూలీలతో తవ్వకాలు జరిపే రీచ్లో టన్నుకు రూ.130 వరకు, దానికి గుత్తేదారు ఖర్చు, నిర్వహణ వ్యయం కూడా కలిపి టన్ను రూ.180- 200 ధరకే ఇసుక సరఫరా కావాలి. సెమీ మెకనైజ్డ్ రీచ్ల్లో గుత్తేదారుకు టన్నుకు రూ.30-35తోపాటు, నిర్వహణ ఖర్చులు కలిపి రూ.80-100 ధరకే విక్రయించాలి. అయితే దాదాపు అన్ని రీచ్ల్లోనూ సగటున టన్నుకు అదనంగా రూ.200-300 వరకు రాబడుతున్నారు.
రాష్ట్రంలో ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రజాప్రతినిధుల జోక్యం ఎక్కువగా ఉంది. ఇసుక రీచ్లు అధికంగా ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన నేతలు ఎక్కువగా ఇసుక వ్యాపారంలో ఉన్నారు. నేరుగా జోక్యం చేసుకుంటున్న 17 మంది ఈ జిల్లాలవారేరని గుర్తించారు. ప్రభుత్వం IVRS కాల్స్ చేసి, అభిప్రాయాలు సేకరిస్తున్నప్పుడు.. అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ ఇసుక కొనుగోలుదారులు ఎక్కువ మంది చెబుతున్నారు. దీంతో ఈ విషయంలో ఎవరెవరి జోక్యం ఉందో ఆరా తీయాలని ప్రభుత్వం గనుల శాఖను ఆదేశించింది. జిల్లాల వారీగా ఎక్కువగా జోక్యం చేసుకుంటున్న ప్రజాప్రతినిధుల జాబితాను కొద్దిరోజుల కిందట గనులశాఖ ప్రభుత్వానికి అందజేసింది.
రీచ్లో ఇసుక తవ్వి, ఒడ్డుకు చేర్చి, లారీల్లో లోడ్ చేసేందుకు గుత్తేదార్లను ఎంపిక చేసే సమయంలోనే ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. అనేకచోట్ల ఇతరులు బిడ్లు వేయనివ్వకుండా..తమవారికే టెండర్లు దక్కేలా చూసుకున్నారు. తక్కువ ధరతో ఇసుక తవ్వుతామని బిడ్లు దక్కించుకున్నాక..రీచ్లోనే నేరుగా టన్నుకు రూ.200-300 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.