ఆంధ్రప్రదేశ్ ఐటీ రాజధానిగా విశాఖను తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు వేస్తోంది కూటమి ప్రబుత్వం. ఇందుకు అనుగుణంగా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇటీవల విశాఖలో టీసీఎస్కు 21 ఎకరాలు కేటాయించిన ఏపీ సర్కార్..lతాజాగా విశాఖలో మరో ఐటీ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడ భూములను అనువైనవిగా గుర్తించింది.
నేషనల్ హైవే పక్కనే –
తర్లువాడ కొండ వద్ద సర్వే నంబరు-1లో 1,080 ఎకరాల భూమి ఉంది. ఈ ప్రాంతం నేషనల్ హైవే పక్కనే, కొండలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇందులో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు 9 ఎకరాలు, మోడల్ హైస్కూల్కు 7 ఎకరాలు గతంలో కేటాయించారు. తాజాగా ఇందులో 200 ఎకరాలు ఐటీ హబ్కు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ కలెక్టర్ ఆదేశాలతో మండల రెవెన్యూ అధికారులు సర్వే పూర్తి చేసి రిపోర్టు రెడీ చేస్తున్నారు. ఈ భూమిలో వంద ఎకరాల్లో డి-పట్టాలిచ్చినట్లు గుర్తించారు. ఇందులో రైతులు మామిడి, జీడిమామిడి సాగు చేస్తున్నారు. సర్వే చేసిన భూమిలో ఆక్రమణదారులు, డి-పట్టాదారుల గుర్తింపుపై పునఃపరిశీలన జరుగుతోంది. భూసేకరణ అనంతరం APIICకి అప్పగించి, ఐటీహబ్కు కేటాయించనున్నారు.
వైసీపీ హయాంలో ఈ భూములను కొందరు బడా నేతలు కాజేయాలని ఆలోచించారు. ప్రధానంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కుమార్తె నిర్మించబోయే ప్రైవేట్ వర్సిటీకి 100 ఎకరాలు కేటాయించేలా చక్రం తిప్పారనే ఆరోపణలు వచ్చాయి. అనుచరులు, అధికారులు లేకుండానే కేవలం సర్వేయర్తో వెళ్లి విజయసాయిరెడ్డి అనేకసార్లు ఈ భూములు చూసి రావడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. గత ప్రభుత్వంలో ఓ బ్యాటరీ పరిశ్రమకు ఈ భూములు కేటాయించేందుకు అడుగులు పడినా స్థానికులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఐటీ హబ్కు ప్రైవేటు భూములు సైతం ఇచ్చేందుకు పలువురు రైతులు ముందుకొచ్చారు. ఇక్కడ ఐటీ పార్క్ ఏర్పాటయితే దాదాపు 10-15 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.