కూటమి ప్రభుత్వం ప్రజలకు మరో గుడ్న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంది. ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ..మండు వేసవిలోనూ చల్లటి కబురు చెప్పింది. కరెంటు బిల్లుల పెంపు నుంచి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఐదేళ్ల తర్వాత తొలిసారి అన్ని కేటగిరీల వినియోగదారులపైనా పైసా భారం వేయకుండా టారిఫ్ను ప్రకటించింది. దీంతోపాటు అదనపు వెసులుబాట్లు కల్పించింది. డిస్కంల ఖర్చులు, ఆదాయాల మధ్య వ్యత్యాసం రూ.12 వేల 632 కోట్లను సబ్సిడీగా భరించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నూతన విద్యుత్ టారిఫ్ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించింది. గృహ వినియోగదారుల టారిఫ్లో ఎలాంటి మార్పులనూ కమిషన్ ప్రతిపాదించలేదు. వచ్చే ఏప్రిల్ నుంచి నూతన టారిఫ్ అమల్లోకి రానుంది. జగన్ సర్కార్ గత ఐదేళ్లలో ఏటా ఏదో ఒక పేరుతో విద్యుత్ భారాలను ప్రజలపై మోపడంతో..టారిఫ్ ప్రకటన అంటేనే ప్రజలు బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది.
డిస్కంల ఆదాయం అంచనా – రూ.44 వేల 323 కోట్లు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోళ్లు, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి రూ.57 వేల 544 కోట్లుగా కమిషన్ అంచనా వేసింది. 2025-26 ఏడాదికి రూ.58,868.52 కోట్లు అవసరమని కమిషన్కు దాఖలు చేసిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో డిస్కంలు పేర్కొన్నాయి. వాటిని పరిశీలించిన మీదట రూ.1,324.35 కోట్లకు కమిషన్ కోత విధించింది. విద్యుత్ విక్రయాల ద్వారా డిస్కంలకు రూ.44,323.30 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కమిషన్ అంచనా వేసింది. రూ.44,185.27 కోట్ల ఆదాయం రావొచ్చని డిస్కంలు ARRలో ప్రతిపాదించాయి. ఆదాయం రూ.138.02 కోట్లు పెరిగే అవకాశం ఉందని కమిషన్ భావించింది.
డిస్కంల అవసరాలు, విద్యుత్ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం మధ్య వ్యత్యాసం రూ.12,632.40 కోట్లుగా కమిషన్ అంచనా వేసింది. ఆదాయ లోటు రూ.14,683.26 కోట్లుగా డిస్కంలు అంచనా వేశాయి. గత ఏడాది ప్రసార, పంపిణీకి రూ.2,114 కోట్లు సర్దుబాటు చేశాక ప్రభుత్వం రాయితీగా భరించాల్సిన మొత్తం 12 వేల 632 కోట్లుగా కమిషన్ అంచనా వేసింది. ఈ మొత్తాన్ని వ్యవసాయ, ఉద్యాన, ధోబీఘాట్లు, ఆక్వాకల్చర్, ఎస్సీ, ఎస్టీలు, పేద రజకులు, స్వర్ణకారులు, నాయీబ్రాహ్మణులు, గోల్డ్కవరింగ్ పరిశ్రమలకు, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం కింద అందించే విద్యుత్కు రాయితీగా ప్రభుత్వం అందిస్తుంది.
విద్యుత్ డిమాండ్ నిర్వహణలో భాగంగా ఎల్టీ పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు TOD టారిఫ్ అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం HT వినియోగదారులకే ఇది ఉంది. ప్రస్తుతం స్టాండ్బై టారిఫ్లు గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ వినియోగదారులకే వర్తిస్తున్నాయి. ఇకమీదట ఓపెన్ యాక్సెస్ వినియోగదారులందరికీ వర్తింపజేయాలని కమిషన్ నిర్ణయించింది. దీనివల్ల ఓపెన్ యాక్సెస్ విధానంలో వినియోగదారులకు అందాల్సిన విద్యుత్ తాత్కాలికంగా విఫలమైతే వినియోగించిన విద్యుత్కు భారీ జరిమానా చెల్లించాల్సిన బాధ తప్పనుంది.
గృహ వినియోగదారులు అదనపు లోడ్ను 50శాతం ఛార్జీలను చెల్లించడం ద్వారా క్రమబద్ధీకరించుకునేందుకు ప్రత్యేక పథకాన్ని కమిషన్ తీసుకొచ్చింది. ఈ పథకం మార్చి1 నుంచి జూన్ 30 వరకు అమల్లో ఉంటుందని కమిషన్ ప్రకటించింది. దీనికోసం..ఆన్లైన్ విండో ద్వారా వినియోగదారులు స్వచ్ఛందంగా అదనపు లోడ్ను ప్రకటించవచ్చు. అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాల్లో వినియోగించే విద్యుత్కు యూనిట్ రూ.6.70 చొప్పున అందించాలని కమిషన్ నిర్ణయించింది. 150 కిలోవాట్ల వరకు కనెక్ట్ చేసిన ఈవీ ఛార్జింగ్ కేంద్రాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. కొత్తగా నిర్మించుకునే..పాత ఇళ్లను పునర్నిర్మించుకునే వారికి గృహ టారిఫ్ను ఏప్రిల్ నుంచి వర్తింపజేయాలని నిర్ణయం.
డిస్కంల స్వల్పకాలిక విద్యుత్ అవసరాలపై వాస్తవికతకు దగ్గరగా అంచనాలు ఉండేందుకు మార్కెట్ నుంచి గంటలవారీగా విద్యుత్ డిస్పాచ్లను కమిషన్ నిర్ణయించింది. గతంలో నెలవారీ విద్యుత్ కొనుగోళ్లు, వినియోగం ఆధారంగా కమిషన్ లెక్కలు పరిశీలించేది. ఏపీ జెన్కో బొగ్గు దిగుమతి చేసుకోడానికి..బొగ్గును రైల్-సముద్రమార్గం-రైల్ ద్వారా రవాణా చేసేందుకు కమిషన్ అనుమతించింది. దీనివల్ల థర్మల్ కేంద్రాలు బొగ్గును సమకూర్చుకునే వెసులుబాటు ఉంటుంది. 2025-26 టారిఫ్తో పాటు.. 2023-24లో పనితీరు నివేదికను కూడా కమిషన్ ఆర్డర్లో తొలిసారి చేర్చింది.











