ప్రస్తుత తరానికి గుణపాఠంగా.. భావి తరాలకు ఓ పాఠంగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. మనం ఎప్పుడూ వినని పదాలు, కనని పరిణామాలను ఆవిష్కరించింది. తనకు ఎదురే లేదంటూ ఆకాశంలో విహరిస్తున్న మనిషిని నేలపైకి దింపింది. ప్రకృతిని శాసిస్తున్నా.. అని అనుకున్న వాడికి విలయాన్ని రుచి చూపింది. ప్రకృతి ముందు తనెంత అల్పుడో మనిషికి తెలియజెప్పింది. కీడే కాదు.. ఎంతోకొంత మేలు కూడా చేసింది. మరుగున పడిపోతున్న మానవతా విలువలను వెలుగులోకి తెచ్చింది. మరచిపోతున్న అనుబంధాలను తట్టి లేపింది. సాంకేతిక మాయాజాలంలో పడి కొట్టుకుపోతున్న మనిషిని.. ఓ తీరం చేర్చింది. కొత్త పదాలను ఎన్నింటినో పరిచయం చేసింది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచింది. మన బడ్జెట్ రూపురేఖలనే మార్చేసింది.
జీవితాలు తల్లకిందులు!
ఈ ఏడాది చాలా మంది తలరాతలు మారిపోయాయి. లాక్ డౌన్ దెబ్బకు జనజీవనం అతలాకుతలం అయిపోయింది. సామాన్యుల బతుకులు రోడ్డు పడ్డాయి. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడ్డారు. ఉద్యోగాలు ఉన్న వారి బతుకులు జీతాల కోతలతో.. ‘అందుకు అందక.. ఇందుకు చాలక’ అన్నట్టు తయారయ్యాయి. వీధి వ్యాపారులు అథోగతి పాలయ్యారు. వలస కార్మికుల పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది. ఉన్న ఊళ్లో పని దొరకక, సొంత ఊళ్లకు వెళ్లేందుకు మార్గంలేక, నడుచుకుంటూ బయలుదేరి మధ్యలోనే వందలాది మంది కన్నుమూశారు. ఇంకెందరో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దేశ విభజన నాటి పరిస్థితులను జ్ఞప్తికి తెచ్చారు. ఇదే సమయంలో ఎంతో మందిలో మానవత్వం మేల్కొంది. అన్నార్తులకు ఆహారం అందించడం, సాటి మనిషికి సేవ చేయడం మొదలైంది. మనుషులకే కాదు.. వీధి జంతువులకూ ఆహారం అందించి ఎంతో మంది మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలుందని చాటారు. నిజానికి మనకు స్వేచ్ఛ విలువను తెలియజెప్పింది లాక్ డౌన్.

సినిమా కష్టాలు!
ఈ ఏడాది సినిమా పరిశ్రమకు పీడకలనే మిగిల్చింది. సంక్రాంతి సినిమాల విజయంతో ఊపుమీదున్నట్టు కనిపించిన పరిశ్రమ.. లాక్ డౌన్ దెబ్బతో కుదేలైంది. నిర్మాణంలో ఉన్నవి ఎక్కడివక్కడ ఆగిపోయి.. వడ్డీల భారంతో నిర్మాతల పరిస్థితి దయనీయంగా తయారైంది. అలాగే, థియేటర్ల ఓనర్లు కూడా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇంతటి దారుణ స్థితిలో ఎంతో కొంత ఓటీటీ ప్లాట్ ఫామ్సే నిర్మాతలను ఆదుకున్నాయని చెప్పొచ్చు. ఈ ఏడాది ఓటీటీల్లో అనేక సినిమాలు డైరెక్టుగా విడుదలయ్యాయి. మొదట్లో చిన్న సినిమాలు మాత్రమే విడుదలైనప్పటికీ.. క్రమంగా పెద్ద సినిమాల నిర్మాతలు కూడా అటువైపు చూడడం మొదలెట్టారు. ఈ కరోనా దెబ్బకు బాగా లాభపడిన రంగం ఏదైనా ఉందంటే.. అది కచ్చితంగా ఓటీటీ అని చెప్పొచ్చు.
ఆన్ లైన్ పాఠాలు!
ఆన్ లైన్ స్కూళ్లు.. మనం ఎప్పుడూ విననివి.. చూడనివి.. పరిచయం లేనివి. కరోనా ప్రభావంతో ఇప్పుడు పిల్లలకు ఇవే దిక్కయ్యాయి. విద్యారంగం తీవ్రంగా దెబ్బతినడంతో.. బళ్లన్నీ ఆన్ లైన బాటపట్టాయి. ఇందుకు జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్, వెబెక్స్ లాంటి యాప్స్ బాగా వాడుకలోకి వచ్చాయి. విద్యార్థులకు ఈ ఏడాది మొత్తం ఆన్ లైన్ లోనే గడిచిపోయింది. చూద్దాం.. వచ్చే ఏడు ఎలా ఉంటుందో!

బంధాలు బలపడ్డాయి
ఈ ఏడాది వచ్చిన కరోనా, లాక్ డౌన్ లు చెడు మాత్రమే కాదు.. కొంచెం మంచి కూడా చేశాయి. ఇంతకాలం బిజీబిజీ జీవితాలతో హడావిడిగా గడుపుతూ.. ఇంట్లో వాళ్లను పట్టించుకోవడం మానేశాం. కనీసం పిల్లలతో కాసేపు గడిపేందుకు కూడా సమయం దొరికేది కాదు. అలాంటిది.. లాక్ డౌన్ పుణ్యమాని.. నెలల తరబడి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కూడా వర్క్ ఫ్రం హోం పేరుతో ఇళ్లలోనే గడపాల్సి వస్తోంది. దీంతో.. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి.. బంధాలు బలపడ్డాయి. దూరభారాన ఉన్న చుట్టాలతో కూడా ఫోన్లలో మాట్లాడడం అలవాటై.. మనిషికి మనిషికీ మధ్య ఉన్న దూరం తరిగిపోయింది. కుటుంబాల మధ్య అన్యోన్యత పెరిగింది.
బయటి ఫుడ్డు వద్దు.. ఇంటి ఫుడ్డే ముద్దు
ఈ ధోరణి కరోనా తెచ్చిన అతిపెద్ద మార్పు. గతంలో ఇంటి భోజనం కన్నా హోటల్ ఫుడ్డుపైనే ఎక్కువగా మక్కువ చూపించిన మనం.. కరోనా దెబ్బతో ఇంటి ఫుడ్డుకు బాగా అలవాటు పడిపోయాం. కొత్తకొత్త వంటకాలు, రుచులను యూట్యూబుల్లో చూస్తూ.. ఇంట్లోనే వండేసుకోవడం మొదలెట్టేశాం. ఇది బాగా అలవాటవడం.. కరోనా భయంతో ఆరోగ్యంపై శ్రద్ధపెరగడం వల్ల.. బయట ఫుడ్డు జోలికి వెళ్లడం మానేశాం.
చైనాకు గుణపాఠం
ఈ ఏడాది విదేశీ వ్యవహారాల్లో భారత్ విజయవంతమైంది. కరోనా సమయంలో ఎన్నో దేశాలకు సాయమందించి.. సంబంధాలను బలోపేతం చేసుకుంది. అలాగే.. చైనా దురహంకారానికి, దురాక్రమణ యత్నానికి దీటైన సమాధానమిచ్చింది. సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడిన డ్రాగన్ కు బుద్ధిచెప్పింది. వారి సైనికులను సరిహద్దుల ఆవలకు తరిమి కొట్టింది. గతంలో పాక్ కు సర్జికల్ స్ట్రైక్స్ తో బుద్ధి చెప్పినట్టే.. చైనాకు డిజిటల్ స్ట్రైక్స్ తో గుణపాఠం నేర్పింది. వందకు పైగా చైనా యాప్ లపై నిషేధం విధించింది. భారత్ పేరెత్తాలంటేనే వణికేలా చేసింది.
కోటి ఆశలతో కొత్త సంవత్సరం లోకి..
కొండంత విషాదం నింపిన ఈ ఏడు దాటి.. సరికొత్త ఆశలతో, అంచనాలతో 2021లోకి అడుగిడబోతున్నాం. టీకా వచ్చేస్తోందన్న అంచనాల మధ్య వచ్చే ఏడుపై భారీగా ఆశలు పెంచుకుంటున్నాం. వచ్చే ఏడన్నా ప్రపంచానికి మంచి జరగాలని కోరుకుందాం.. జరుగుతుందని ఆశిద్దాం.











