ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల పెంపు వ్యవహారం ఈ నెలాఖరుకు గానీ కొలిక్కి వచ్చేలా లేదు. ఈ విషయంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ నెల 17వ తేదీ ఆఖరి సమావేశం నిర్వహించనుంది. మొన్న హీరోలు, చిత్ర ప్రముఖుల బృందం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని కమిటీ తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ నిర్ణయం వెలువడ్డాకే పెద్ద సినిమాలన్నీ వరుసగా విడుదాల కానున్నాయి.
ఈ విషయంలో మొన్న జరిగిన హీరోల భేటీ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది అనే అంశం కన్నా మెగాస్టార్ చిరంజీవి ఈ భేటీతో జీరో అయ్యారా, హీరో అయ్యారా అన్న అంశం మీదే చర్చ ఎక్కువ నడుస్తోంది. సీఎం జగన్ ను చిరంజీవి ప్రాధేయపడుతున్నట్లు మాట్లాడటాన్ని ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఈ విషయంలో హీరోలు ఇలా వెళ్లడం కూడా ఒక మైనస్ గానే భావిస్తున్నారు. వెళ్లిన వారంతా జీరోలుగా, సమావేశానికి వెళ్లని వారిని హీరోలుగా నెటిజన్లు పొగుడుతున్నారు.
ఈ భేటీ తర్వాత పేర్ని నాని నటుడు మోహన్ బాబు ఇంటికి వెళ్లడం మరో వివాదానికి తావిచ్చింది. ఆ తర్వాత మా అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్ చేయడం మరో వివాదానికి దారితీసింది. చివరికి ఆ ట్వీట్ ని ఎడిట్ చేసే దాకా విష్ణు వెళ్లాడు. దీని మీద మంత్రి పేర్ని నాని కూడా విష్ణు ట్వీట్ ను ఖండించాడు. అసలు సినిమా వారు ఏది చేసినా పెద్ద వివాదం అయి కూర్చుంటుంది. చర్చలు సానుకూలంగా జరిగాయని అందరూ ప్రకటించినా జరిగిన తీరు మాత్రం విమర్శలకు తావిచ్చింది. ఎవరేమనుకున్నా ఇండస్ట్రీకి మేలు జరిగితే అంతే చాలు అనేలా పరిశ్రమ వర్గాలు ఉన్నాయి. త్వరలో ప్రభుత్వం ప్రకటించే తుది నిర్ణయం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.