ఏడాది గడవకముందే అంతా మారిపోయింది. జగన్ హయాంలో విధ్వంసానికి సాక్షిగా నిలిచిన స్వామి వారి సన్నిధి..నేడు లోక కల్యాణానికి వేదికగా మారింది. అమరావతి రాజధానిని ధ్వంసం చేయడానికి గత జగన్ సర్కార్ వెంకటపాలెం శ్రీనివాసుడి సన్నిధినే సాక్షిగా మార్చుకోగా..ఇవాళ కూటమి ప్రభుత్వం లోక కల్యాణం కోసం చేసే శ్రీవారి కల్యాణానికి అదే ప్రాంతాన్ని వేదికగా మార్చింది. రాజధాని అమరావతిలోని ఆ శ్రీనివాసుడి సన్నిధి రెండు భిన్న ఘటనలకు వేదికగా మారింది.
రెండేళ్ల కిత్రం అప్పటి వైసీపీ ప్రభుత్వం రాజధాని రైతుల గుండెలపై వెలిగించిన ఆరని కుంపటి R-5 జోన్ చిచ్చును ఇక్కడే రాజేసింది. రాజధానిలో పేదలకు సెంటు పట్టాల పేరుతో మొదలుపెట్టిన చిచ్చుకు అప్పటి ప్రభుత్వం శ్రీవారి సన్నిధినే వేదికగా ఎంచుకుంది. 2023 మే 25న ఆ తతంగాన్ని నిర్వహించింది. వేలాది మందిని ఇక్కడికి తరలించి, రాజధాని రైతులపై యుద్ధం ప్రకటించారా అనే స్థాయిలో కార్యక్రమం నిర్వహించి రైతులపై బల ప్రదర్శనకు దిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా లెక్క చేయకుండా తన పంతం నెగ్గించుకుంది. R-5 జోన్లో ప్లాట్లను కేటాయిస్తూ లబ్ధిదారులకు పట్టాలిచ్చింది.
ఆ రోజున రాజధాని గ్రామాలన్ని గుండెలు పగిలేలా రోదించాయి.
కానీ అవేమి అప్పటి పాలకులకు పట్టలేదు. హెలీకాప్టర్లో వచ్చి ఒకరిద్దరికి సెంటు పట్టాలిచ్చి వెళ్లిపోయాడు. సరిగ్గా 22 నెలలు గడిచేసరికి సీన్ మారిపోయింది. నాటి విధ్వంసానికి మౌనసాక్షిగా నిలిచిన శ్రీవారు..నేడు తన కల్యాణంతో లోక కల్యాణానికి శ్రీకారం చుట్టారు. శనివారం వెంకటపాలెంలో శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని TTD అంగరంగ వైభవంగా నిర్వహించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీవారి కల్యాణోత్సవాన్ని తిలకించి, భక్తి పారవశ్యంలో మునిగితేలారు. అమరావతి చిరకాలం వర్ధిల్లాలని వేద పండితులు ఆశీర్వదించారు. రాజధాని రైతులకు, ప్రత్యేకించి రాజధాని మహిళలకు కల్యాణోత్సవంలో అగ్రతాంబూలం ఇచ్చి కూటమి ప్రభుత్వం గౌరవించింది. వేదికకు సమీపంలో వారికోసం ప్రత్యేకంగా గ్యాలరీలు కేటాయించి, వేడుకల్లో భాగస్వాములను చేసింది.
సెంటు పట్టాల పంపిణీ కార్యక్రమానికి వేలాది మందిని బలవంతంగా తరలించిన గత వైసీపీ ప్రభుత్వం సభా ప్రాంగణంలోకి కొంతమందినే అనుమతించింది. మిగిలినవారిని వారి ఖర్మానికి వదిలేసింది. మండు వేసవి ఎండల్లో తినడానికి తిండి లేక, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక మహిళలు, పేదలు అల్లాడిపోయారు. అప్పటి ముఖ్యమంత్రి మాత్రం 8 కి.మీ దూరానికే హెలికాప్టర్లో ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కాగా ఇప్పుడు పకడ్బందీ ఏర్పాట్లతో ఏ ఒక్క భక్తుడికీ చిన్న ఇబ్బంది కూడా రాకుండా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికీ తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, శ్రీవారి ప్రసాదం అందించారు.