తెలంగాణ ఉద్యమ కారుడు, కార్మిక నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో గురువారం సాయంత్రం ముగిశాయి. నాయినిని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు, నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి బూబ్లీహిల్స్ వరకు నాయిని అంతిమయాత్ర కొనసాగింది. దారిపొడవున నాయిని అభిమానులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అధికారిక లాంఛనాలతో నాయిని నర్సింహ్మారెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వం నిర్వహించింది.
పాడె మోసిన మంత్రులు..
అంత్యక్రియల్లో మంత్రి కేటీఆర్ స్వయంగా పాల్గొన్నారు. ఆయనతో పాటు మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్మిక సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. అయితే అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్తోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, మరికొంత మంది నేతలు.. నాయిని పాడెను మోశారు. కేసీఆర్ కుంటుంబంతో నాయినికి ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుండి తుదిశ్వాస వరకు కేసీఆర్ వెంటే నాయిని నడిచారు. నాయిని నర్సింహ్మారెడ్డి కరోనాబారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కేటీఆర్, హరీష్ ఆయనను పరామర్శించారు. నిన్న బుధవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కూడా నేరుగా వెళ్లి ఆస్పత్రిలో నాయినిని పరామర్శించిన విషయం తెలిసిందే. అదే రాత్రి నాయిని ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు.
కేసీఆర్ పై అలక..
తెలంగాణ రాష్ట్ర మొదటి హోంశాఖ మంత్రిగా నాయిని పనిచేశారు. గవర్నర్ కోటాలో శాసన మండలికి ఎంపికైన నాయిని పదవి కాలం 2020 ఏప్రిల్తో ముగిసింది. అయితే గత ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి నాయిని ఎమ్మెల్యే టికెట్ ఆశించి బంగపడ్డారు. తనకు కాకుండా ముఠాగోపాల్కి టిక్కెట్ ఖరారు చేయండంతో నాయిని అప్పటి నుంచి కేసీఆర్ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటి నుంచి నాయిని పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగానే ఉన్నట్లు ప్రచారం జరిగింది.