పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సొంత పార్టీ టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. సర్కార్ పనులంటేనే కాంట్రాక్టర్లు భయపడుతున్నారని పేర్కొన్న ఆయన పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉందని అన్నారు. కాంట్రాక్టర్ల కాళ్లు మొక్కినా ఎవరూ వస్తలేరని వెల్లడించారు. రాష్ట్రంలో చేసిన పనులకు ఎప్పుడు బిల్లులు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని వెల్లడించారు. ఓ ఎమ్మెల్యేగా తానే బిల్లుల కోసం తిరుగుతున్నానంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. క్వాలిటీ పేరిట 20 శాతం కట్ చేస్తే కాంట్రాక్టర్లు బతకాలా? చావాలా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంట్రాక్టర్లకు సరిగా బిల్లులు రావడం లేదని గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సొంత పార్టీనే మరింత చిక్కులలో నెట్టుతూ ధర్మారెడ్డి చేసిన ఈ కామెంట్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొందరు నాయకులు, కాంట్రాక్టర్లు ధర్మారెడ్డి చెప్పింది నిజమేనంటూ ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యే ధిక్కారణ స్వరం వినిపించడంతో అధిష్ఠానం సీరియస్ అయిందనే వార్తలు టీఆర్ఎస్ వర్గాల నుంచి వినబడుతున్నాయి. కాంట్రాక్టర్ గా రాజకీయాలలో అడుగు పెట్టిన ధర్మారెడ్డి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత అధికార పార్టీలో చేరిన ఆయన టీఆర్ఎస్ అనుబంధ సభ్యుడిగా మారాడు. 2018లో జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖపై దాదాపు 50 వేల మెజారిటీతో గెలుపొందారు.