ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునే దిశగా సాగుతుండడంతో పాటు మరో స్థానాన్ని బీజేపీ నుంచి చేజిక్కించుకుంది. గెలుపునకు కారణాలెన్ని ఉంటాయో..ప్రత్యర్థుల వైఫల్యాలూ అలాగే తెరపైకి వస్తాయి. అయితే ఈ గెలుపుతో బీజేపీకి స్పీడ్కి టీఆర్ఎస్ బ్రేకులు వేయడంతో పాటు పోల్ మేనేజ్మెంట్లో, ఓటర్లను ఆకర్షించడంలో కేసీఆర్ వ్యూహాలు మరోసారి సక్సెస్ అయ్యాయని చెప్పవచ్చు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల విమర్శలకూ కేసీఆర్ చెక్ పెట్టినట్టు భావించవచ్చు.
సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీజేపీ..
ఇక గెలుపు విషయానికి వస్తే.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తన సమీప బీజేపీ అభ్యర్థి రామచందర్రావుపై 11,703ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో బీజేపీ తమ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. వాణీదేవికి 1,49,269 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకి 1,37,566 ఓట్లు వచ్చాయి. ఇక వరంగల్-ఖమ్మం-నల్గొండలోనూ పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తరువాత కోదండరాం ఎలిమినేట్ కావడంతో ఆ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే సగం ఓట్ల లెక్కింపు పూర్తయింది. ప్రస్తుత సమాచారం ప్రకారం గెలుపునకు కావాల్సిన 1,83,167 ఓట్లకు పల్లా రాజేశ్వర్ రెడ్డి 59వేల ఓట్ల దూరంలో ఉండగా, తీన్మార్ మల్లన్న 83వేల ఓట్లు రావాల్సి ఉంటుంది. అయితే ఇందులో ప్రొ.కోదండరాంకి వచ్చిన ఓట్లలో ఎవరికి ఎన్ని పడతాయనే లెక్క ప్రకారం చూస్తే.. తీన్మార్ మల్లన్నకు వన్ సైడెడ్ ఓట్లు పడితేనే తీన్మార్ మల్లన్న గెలుపు సాధ్యం అవుతుంది. అయితే అందుకు చాలా తక్కువ అవకాశాలున్నాయి.
టీఆర్ఎస్కు ఊరట..
2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో మొదలైన టీఆర్ఎస్ విజయాల పరంపరకు 2019లో కవిత ఓటమితో పాటు లోక్సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలతో బ్రేక్ పడింది. అయితే అప్పటికీ ఎక్కువ మంది ఎంపీలు టీఆర్ఎస్ వారే కావడం, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ కేడర్ ఎక్కడ నిరుత్సాహ పడలేదు. తరువాత పురపాలక, పంచాయతీ, పరిషత్ ఎన్నికలు, హుజూర్నగర్ ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే దుబ్బాకలో బీజేపీ గెలిచింది. జీహెచ్ఎంసీలోనూ బీజేపీ గట్టి పోటీ ఇచ్చి టీఆర్ఎస్కు షాక్ ఇచ్చింది. దీంతో శ్రేణుల్లో కొంత నైరాశ్యం కనిపించింది. తాజాగా ఎమ్మెల్సీ గెలుపు టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. కాగా కేసీఆర్ విధానాలకు మరోసారి ఓటర్లు ఆమోదం తెలిపారని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.
విమర్శలకు చెక్..
ఈ గెలుపుతో కొన్ని విమర్శలకు కూడా టీఆర్ఎస్ చెక్ పెట్టిందని చెప్పవచ్చు. గతంలో హైదరాబాద్ -రంగారెడ్డి-మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ని నిలిపినా పార్టీ ఓడింది. దీంతో పలు విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అనూహ్యంగా చివరిక్షణంలో పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు పోల్ మేనేజ్మెంట్ వెంటనే మొదలు పెట్టింది. మంత్రులు హరీష్, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్లను రంగంలోకి దింపింది. సురభి వాణీదేవి పేరు ప్రకటించడంతో..మరోసారి పీవీ కుటుంబ పేరును వాడుకుంటున్నారని, ఓడిపోయే స్థానంలో పీవీ కుమార్తెను బరిలోకి దింపుతున్నారని విమర్శలూ వచ్చాయి. గతంలో శంకరమ్మను హుజూర్నగర్ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీకి దింపి ఇలాగే చేశారని వైరి పక్షాల నేతలు వ్యాఖ్యానించారు. అయితే ఈ గెలుపుతో అలాంటి విమర్శలకు చెక్ పెట్టినట్టు భావించవచ్చు. బీజేపీ విమర్శల విషయం పక్కన బెడితే.. తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న బీజేపీ సిట్టింగ్ సీటును కోల్పోవడంతో పాటు మరో ఎమ్మెల్సీ స్థానంలో నాలుగోస్థానానికి పడిపోయింది.











