జీహెచ్ఎంసీ ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో స్పీడ్ పెంచాయి. అయితే ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఇద్దరు సీఎంలు పాల్గొన్నారు. అదేంటి రాష్ట్రానికి ఒక్కరే కదా ఉండేది సీఎం అనుకుంటున్నారా!. అవును రాష్ట్రానికి ఒక్కరే సీఎం. కానీ గ్రేటర్ ఎన్నిల ప్రచారంలో ఇద్దరు సీఎంలు పాల్గొన్నారు. ఒక ముఖ్యమంత్రి రోడ్ షోలలో పాల్గొంటే.. మరొక ముఖ్యమంత్రేమో బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఆ పార్టీ అగ్రనాయకత్వాన్నందరినీ హైదరాబాద్లోనే మొహరించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం మధ్యాహ్నం గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం సాయంత్రం గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే రేపు అమిత్షా కూడా పాల్గొంటున్నారు. ఇలా కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రచారంతో బీజేపీ ముందు నుంచి దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే మరో వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎల్బీ స్టేడియంలో తమ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభా వేదిక నుంచి బీజేపీ స్పీడ్ను కేసీఆర్ బ్రేక్ వేయనున్నట్లు టీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. గ్రేటర్ ఎన్నిక నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులు తమ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల కోసం ఒకేసారి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ పడుతూ ప్రచారం నిర్వహించడం చాలా అరుదు. అయితే ఈ ఇద్దరూ సీఎంలు కూడా తమ మాటలతో ప్రజలను ఆకర్షించడంలో సిద్ధహస్తులై ఉండడం విశేషం.