ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చెరతారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు సోనియా, రాహుల్ గాంధీలతో ఆయన సమావేశమయినప్పటికీ ఆయన చేరిక పై సస్పెన్స్ మాత్రం వీడలేదు. తాజాగా నేడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో పార్టీకి చెందిన పలు కీలక అంశాలపై ఆమె చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ప్రశాంత్ కిశోర్ను పార్టీలోకి చేర్చుకునే విషయంపై మాత్రం చర్చ జరిగిందా? లేదా? అనే విషయంపై మాట్లాడేందుకు సీనియర్ నేతలు సాహసించడం లేదు. దీంతో ఈ భేటీలోనూ కాంగ్రెస్ పార్టీలో పీకే చేరికపై సస్పెన్స్ వీడనట్లుగానే స్పష్టం అవుతోంది.
ఇదిలా ఉంటే, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ ఆమోదించిందని సమాచారం.ప్రధానంగా 2024 ఎన్నికల కోసం ఎంపవర్డ్ గ్రూప్ పేరిట ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో చింతన్ శిబిర్ పేరిట నిర్వహించనున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశం రాజస్థాన్లో వచ్చే నెలలో నిర్వహించాలని కూడా పార్టీ హై కమాండ్ నిర్ణయించింది.